అనుమతిస్తే నా కొడుకుకు చివరిసారిగా పూరీ, సబ్జీ ఇవ్వాలని ఉంది: వినయ్ శర్మ తల్లి
న్యూఢిల్లీ: నిర్భయ నిందితులనే మరికాసేపట్లో ఉరితీయబోతున్నారు. డెత్ వారెంట్ను రద్దు చేయాల్సిందిగా గురువారం అర్థరాత్రివరకు కోర్టుల్లో వాదనలు జరిగాయి. అయితే అన్ని పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అనంతరం సుప్రీంకోర్టు కూడా అర్థరాత్రి పిటిషన్ను వినేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఇక నిందితులు చేసిన ప్రయత్నాలకు మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇక నిర్భయ నిందితుల్లో ఒకరైన వినయ్ శర్మ తల్లి మాత్రం తన కొడుకుకు ఏమీ తెలియదని అమాయకుడని విలపించింది.
ఢిల్లీలోని ఓ చిన్న ఇంట్లో ఉన్న వినయ్ శర్మ తల్లి బట్టలు ఉతుకుతూ కనిపించింది. తన ఇంటిలోకి ఎవరినీ రానీయడం లేదు. అంతేకాదు మీడియా ప్రతినిధులు వెళ్లగా ఏంరాసుకుంటారు అని ప్రశ్నించింది. ఇప్పటి వరకు కేసులో ఏమైనా జరిగిందా.. భగవంతుడు తన కుమారుడిని కాపాడాలని భావిస్తే అది జరిగితీరుతుంది లేదంటే ఉరిశిక్ష తప్పదని వినయ్ శర్మ తల్లి చెప్పింది. ఎవరు బతకాలో ఎవరు చావాలో అనేది భగవంతుడు మాత్రమే నిర్ణయిస్తాడని వెల్లడించింది. మానవుడు కేవలం నిమిత్త మాత్రుడే అని చెప్పింది.
తీహార్ జైలులో ఉన్న తన కొడుకుకు ఆహారం తీసుకెళ్లినప్పుడల్లా జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లనిచ్చేవారు కాదని చెప్పింది. ఈ సారి అంటే చివరిసారిగా తనను అనుమతిస్తే మాత్రం తన కొడుకుకు పూరీ, సబ్జీ, కచోరీ తీసుకెళ్లాలని ఉందని వినయ్ శర్మ తల్లి వెల్లడించింది. ఇక చివరిసారిగా తన కొడుకును కలుస్తానని చెప్పిన తల్లి భోరున విలపించింది. మిగతా ముగ్గురు నిందితులతో పాటు వినయ్ శర్మను కూడా మరికాసేపట్లో ఉరితీయనున్నారు.
Recommended Video
మార్చి 5వ తేదీన ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 20న ఉదయం 5:30 గంటలకు నిందితులను ఉరితీయాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే నిందితుల్లో ఒకరైన రాంసింగ్ 2015లో ఆత్మహత్యకు పాల్పడగా జువైనల్ గా ఉన్న మరో నిందితుడు మూడేళ్ల తర్వాత విడుదలయ్యాడు. ఇక రామ్ సింగ్ సోదరుడు ముఖేష్ సింగ్ మరోనిందితుడు . వీరి తల్లి సొంత రాష్ట్రం రాజస్థాన్కు వెళ్లిపోగా... వినయ్ శర్మ పవన్ గుప్తా కుటుంబాలు ఢిల్లీలోని ఓ స్లమ్ ఏరియాలో నివసిస్తున్నాయి. పవన్ గుప్తా కుటుంబ సభ్యులు పండ్లు అమ్ముకుంటూ జీవితం సాగిస్తున్నారు.