లోకల్, నాన్ లోకల్, అమిత్ షా గుజరాతి, సీఎం సిద్దూ రాహుల్ గాంధీ ఎవరు ? బీజేపీ కౌంటర్ !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల వేడి ఆరు నెలల ముందే మొదలైయ్యింది. లోకల్, నాన్ లోకల్ పదాలతో సీఎం సిద్దరామయ్య బీజేపీ మీద విరుచుకుపడుతున్నారు. కర్ణాటకను ఉద్దరించే సత్తా మీకు మాత్రమే ఉందా, మీరు మాత్రమే లోకల్, మా నాయకులను నాన్ లోకల్ అంటారా అని బీజేపీ ఎదురుదాడికి దిగింది.
అమిత్ షా గుజరాతీ
డిసెంబర్ 25వ తేదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మైసూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సందర్బంలో అమిత్ షా కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద విరుచకుపడ్డారు. అమిత్ షా ఆరోపణలపై సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ అమిత్ షా గుజరాతీ, కన్నడ గడ్డ గురించి ఏం తెలుసు, నేను కర్ణాటక మణ్టిన మగ (కర్ణాటక మట్టి బిడ్డను) అని మండిపడ్డారు.
సోనియా, రాహుల్ ఎవరు ?
బీజేపీ ఎంపీ, ఆ పార్టీ కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి శోభా కరంద్లాజే శనివారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా కన్నడిగ కాదు, గుజరాతీ అంటున్న సీఎం సిద్దరామయ్య సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ ను రావద్దు అని చెప్పండి
బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో అమిత్ షా కర్ణాటకకు వచ్చారని మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం కర్ణాటక రావద్దని మీరే చెప్పాలని, ఆధైర్యం సీఎం సిద్దరామయ్యకు ఉందా అని శోభా కరంద్లాజే సీఎంను సూటిగా ప్రశ్నించారు.
యడ్యూరప్ప కర్ణాటక బిడ్డ కాదా !
తాను కర్ణాటక మట్టి బిడ్డ అని చెప్పుకుంటునన్న సీఎం సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కర్ణాటక మట్టి బిడ్డ కాదా ? అని శోభా కరంద్లాజే ప్రశ్నించారు. సిద్దరామయ్య నాలుకకు నరం లేదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని శోభా కరంద్లాజే విరుచుకుపడ్డారు.