30 లోపే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఛాన్స్: దాటితే మంధ్యంతర ఎన్నికలే!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆటంబాబులాంటి వార్త పేల్చారు. ఈ నెల 30వ తేదీలోగా భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఆ గడువు దాటితే- మధ్యంతర ఎన్నికలు తప్పవని ఆయన జోస్యం చెప్పారు. దీనిపై తన వద్ద పక్కా సమాచారం ఉందని చెప్పారు. సిద్ధరామయ్య నివాసం కావేరిలో ఆయన పార్టీ నేతలు సతీష్ జార్కిహోళి, జమీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే ధృవ నారాయణ, ఐవన్ డిసౌజా, కృష్ణప్ప సేరితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశం అయ్యారు.
ఆగలేకపోతున్న యడ్డియూరప్ప: ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు!
అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే- తమ విధి, విధానాలను సమూలంగా మార్చుకోవాల్సి ఉంటుందని, అధికార మత్తును దించుకోవాలని ఆయన పార్టీ శ్రేణకులకు హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల్లో చొచ్చుకు వెళ్లాలని అన్నారు. అదే సమయంలో సిద్ధరామయ్య- మధ్యంతర ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు.
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్నారు. దీనిపై తన వద్ద పక్కా సమాచారం ఉందని చెప్పారు. ఈ నెల 30వ తేదీ లోగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే- ఇక మధ్యంతర ఎన్నికలు తప్పవని, దీనికి సిద్ధం కావాలని ఆయన సూచించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బీజేపీకి అంత సులభతరం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని సిద్ధరామయ్య అంచనా వేశారు.
ఈ కారణంతోనే- బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారానికి హడావుడిగా ముహూర్తం నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన రాజ్భవన్లో గవర్నర్ వజూభాయ్ వాలాను కలుసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్ అంగీకరించడంతో- శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆయన రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సిద్ధరామయ్య తాజాగా చేసిన ప్రకటనకు, ఇంత హడావుడిగా ఆయన ప్రమాణ స్వీకారానికి పూనుకోవడానికి లింక్ ఉన్నట్టే కనిపిస్తోంది.