'బీహార్లో బిజెపి ఓడితే పాకిస్తాన్లో టపాసులు పేలుస్తారు'
పాట్నా: భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా గురువారం నాడు బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే పాకిస్తాన్లో బాణసంచా కాలుస్తారని అమిత్ షా అన్నారు.
ఒకవేళ బిజెపి ఓడిపోతే జైలులో ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ నేత, క్రిమినల్ మహ్మద్ షాబుద్దీన్ కూడా టపాకాయలు పేలుస్తాడని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్, షాబుద్దీన్లను ఆనందపరిచే ఫలితాలు రావాలనుకుంటున్నారా అని అమిత్ షా బీహార్ ప్రజలను ప్రశ్నించారు.
దానికి బహిరంగ సభకు హాజరైన ప్రజలు... లేదు, లేదు అంటూ సమాధానం ఇచ్చారు. అమిత్ షా ఇంకా మాట్లాడుతూ... జాతీయవాద ప్రభుత్వానికి, పార్టీకి ఓటేయాలని కోరారు. రాష్ట్రం నుంచి అహింసను పంపించేద్దామన్నారు. అమిత్ షా బెట్టియా ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై మహా కూటమి నేతలు మండిపడ్డారు. ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేస్తాంటున్నారు.
ప్రతి విషయాన్ని రాజకీయం చేయద్దు: వెంకయ్యనాయుడు
ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం కొందరికి అలవాటై పోయిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీలో విమర్శించారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు అర్హత ప్రకారమే ప్రభుత్వ బంగళాను కేటాయించినట్లు చెప్పారు. ప్రభుత్వ బంగ్లాలను స్మృతి కేంద్రాలుగా మార్చకూడదని గతంలో సుప్రీం తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఢిల్లీలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నివసించిన భవనం ప్రభుత్వ బంగళానే అని, అందుకే మంత్రి శర్మకు కేటాయించామన్నారు. కాగా, కలాం నివసించిన బంగళాను కేంద్రమంత్రి మహేశ్ శర్మకు ఇవ్వడంపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై వెంకయ్య స్పందించారు.