బీజేపీ ఎంపీ నోటి దూల:కార్ల విక్రయాలు తగ్గితే..మరి రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఎందుకవుతోంది..
బాధ్యతయుతమైన పదవీలో ఉన్న నేతలు అలాగే నడుచుకోవాలి. కానీ కొందరు ఇటీవల నోరుజారుతున్నారు. లైంగికదాడులపై నోటిదూల చూపిస్తున్నారు. మరికొందరు పెరుగుతున్న ఉల్లి గడ్డలపై కూడా నోరు పారేసుకుంటున్నారు. ఇలా ఉండగా బీజేపీ ఎంపీ ఒకరు ఆటోమొబైల్ సెక్టార్ గురించి.. నిండు పార్లమెంట్లో ప్రసంగించి అభాసుపాలయ్యారు.
బలియా లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరేంద్ర సింగ్ గురువారం లోక్సభలో ఆటోమొబైల్ విక్రయాలు పడిపోయాయనే అంశంపై తనదైన శైలిలో స్పందించారు. దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చిందని, ఆటోమొబైల్ విక్రయాలు పడిపోయాయని చెప్తున్నారు. మరి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ ఎందుకు తగ్గలేదని మేధావిలా ప్రశ్న వేశారు.
దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని.. అందుకే ఆటోమొబైల్ సెక్టార్ విక్రయాలు పడిపోయాయని చెప్తున్నారు. నిజంగా ఆటోమొబైల్ విక్రయాలు పడిపోతే రహదారుల మీద ఉన్న ట్రాఫిక్ ఏంటీ అని లోక్సభలో ప్రశ్నించారు. ఆటోమొబైల్ విక్రయాలు పడిపోవడంతో.. కార్ల కంపెనీలు ఉత్పత్తిని కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆగస్ట్, సెప్టెంబర్లో పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ అక్టోబర్లో మాత్రం 0.28 శాతం విక్రయాలు జరగడం కాస్త ఊరటనిచ్చే అంశం.
ఇదే అంశంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. 1990 తర్వాత జన్మించిన యువత కార్లను కొనుగోలు చేయడం లేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాదు కార్ల విక్రయలు పడిపోవడానికి ఓలా, ఉబెర్ కూడా కారణమని నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.