అరెస్ట్ తప్పదని చెబుతున్న సీబీఐ వర్గాలు.. చిదంబరం ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటీ ?
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరాన్ని నీడలా వెంటాడుతుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా .. శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో సీబీఐ, ఈడీ అధికారుల కళ్లు గప్పి తప్పించుకోవడమా ? లేదంటే కేసు విచారణకు హాజరవడమా ? అనే అంశాలే చిదంబరం కోర్టులో మిగిలి ఉన్నాయి.
నేనున్నాంటూ చిదంబరానికి మద్దతు పలికిన ఎంకే స్టాలిన్...
టెన్షన్ .. టెన్సన్ ..
చిదంబరం స్పెషల్ లీవ్ పిటిషన్పై బుధవారం ఉదయం నుంచి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే బెయిల్ పిటిషన్ విచారణ శుక్రవారం చేపడుతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు నోటీసులు జారీచేయడంతో ఏం చేయాలనే అంశంపై చిదంబరం మదనపడుతున్నారు. ఆయన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సీబీఐ అధికారులకు లొంగిపోవడం, రెండోది శుక్రవారం వరకు దొరకకుండా ఆజ్ఞాతంలో ఉండడం.
వీజీ కాదు ..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో శుక్రవారం ఆజ్ఞాతంలో ఉండటం అంటే సాధారణ విషయమేమి కాదు. ముఖ్యంగా పోలీసుల కళ్లు గప్పి .. మాజీ కేంద్ర మంత్రి నక్కి ఉండే అవకాశం లేదు. సీబీఐ అధికారుల తలచుకుంటే చిదంబరం ఆచూకీ కనుగొనడం కష్టమేమీ కాదు. ఇంటెలిజెన్స్ సహకారంతో ఎక్కడున్న పట్టుకొంటారు. ఈ విషయం చిదంబరానికి కూడా తెలుసు. రెండో సీబీఐ అధికారులకు సరెండర్ కావడం. దీనిని మించిన ఆప్షన్ చిదంబరానికి లేదు. సరెండరయ్యాక .. వారు ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టి విచారణకు ఇవ్వమని కోరతారు. అంతకుముందు వైద్య పరీక్షలు కూడా చేస్తారు. తమ కేసు విచారణ కోసం గడువు కోరితే .. న్యాయమూర్తి ఇచ్చే అవకాశం ఉంది.
ఏం చేస్తారో ..
అయితే చిదంబరం లొంగిపోతారా లేదంటే తప్పించుకుని తిరుగుతారా అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం చిదంబరాన్ని ఆర్థిక నేరస్తులతో పోలుస్తున్నారు. చిదంబరం కూడా మరో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా అంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు గాంధీ కుటుంబం చిదంబరానికి ఇంత స్వేచ్చ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చిదంబరం కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఆర్థిక లావాదేవీలలో అవకతవకలకు సంబంధించి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కార్తీ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
మరోసారి ఇంటికి
సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు కావడంతో ఆయన ఇంటికి మరోసారి సీబీఐ అధికారులు చేరుకున్నారు. మరోవైపు లుక్ ఔట్ నోటీసులు కూడా జారీచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. దీంతో ఆయన విదేశాలకు వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. మరోవైపు చిదంబరానికి కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే రాహుల్, ప్రియాంక సపోర్ట్ చేశారు. చిదంబరం గుండెధైర్యాన్ని శశిథరూర్ కొనియాడారు. మరోవైపు రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ ఫైలట్ కూడా చిదంబరానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.