హస్తినలో హస్తం, ఆప్ మధ్య పొత్తు పొడిచేనా ? : ఎల్లుండి పవార్ మధ్యవర్తిత్వంలో మరోసారి చర్చలు
న్యూఢిల్లీ : హస్తినలో హస్తం, ఆప్ పోటీ చేసే అంశం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఢిల్లీ 7 స్థానాల్లో విడివిడిగా పోటీచేస్తామని కాంగ్రెస్, ఆప్ ఇప్పటికే ప్రకటించగా .. పొత్తుపై మాత్రం చర్చలు జరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం కూడా పొత్తులపై రాహుల్, కేజ్రీవాల్ స్పందించారు. ఈ క్రమంలో బుధవారం రెండుపార్టీల ప్రతినిధులు సమావేశమై .. పొత్తుల అంశం తేలుస్తారని సమాచారం.
ఈ రెండు అంశాలే ?
ఢిల్లీలో కాంగ్రెస్ మూడు చోట్ల పోటీచేస్తామని చెబుతోంది. కానీ రెండు సీట్లే కేటాయిస్తామని ఆప్ బెట్టు చేస్తోంది. దీంతోపాటు పొత్తును ఢిల్లీకే పరిమితం చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోండగా .. పంజాబ్, హర్యానాలో కూడా కలిసి పోటీ చేస్తామని ఆప్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాల మధ్య రెండు పార్టీల మధ్య స్థబ్ధత నెలకొంది.
పవార్ మధ్యవర్తిత్వం ..
కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరగనున్నాయి. ఆయన ఇప్పటికే ఓసారి చర్చలకు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్, ఆప్ నుంచి సంజయ్ సింగ్ చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆప్ కు ఐదు, కాంగ్రెస్ రెండు సీట్లలో పోటీ చేసేందుకు ప్రతిపాదన వస్తోందని .. దీనికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విశ్వసనీయంగా తెలిసింది.
ఓ వైపు పొత్తులు .. మరోవైపు ట్వీట్లు
ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఆప్ అధినేత కేజ్రీవాల్ పేర్కొన్నారు. దీంతో మన మధ్య పొత్తు అవసరం రాహుల్ ట్వీట్ చేశారు. అయితే నిజానికి కాంగ్రస్ పార్టీ పొత్తును కోరుకోవడం లేదని ఆప్ కౌంటర్ ట్వీట్ కూడా చేసింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచేనా అనే సందేహం తలెత్తుతోంది.