పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆదేశంలో దీపావళి పండుగే: విజయ్ రూపానీ
అహ్మదాబాదు: రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్తాన్లో దీపావళి జరుపుకుంటారనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరగదని అన్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే పాకిస్తాన్లో మాత్రం నిజంగానే దీపావళి పండగ జరుగుతుందని ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు మొత్తం పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతోందన్నారు విజయ్ రూపానీ.
అందుకే దేశ ప్రజలు మరోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని ఆ విషయం మే 23న తెలుస్తుందని విజయ్ రూపానీ జోస్యం చెప్పారు. విజయ్ సంకల్ప్ యాత్రలో భాగంగా మెహసానాలో ఆయన ప్రసంగిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి రుజువులు చూపించాలని కాంగ్రెస్ నేత శాంప్రిటోడా కోరడంపై ధ్వజమెత్తారు విజయ్ రూపానీ. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పిన విజయ్ రూపానీ.... ఎవరో ఆరేడు మంది పుల్వామా దాడులకు తెగబడితే ఆ నేరాన్ని పాకిస్తాన్కు మొత్తం అంటగట్టడం తప్పని శాంప్రిటోడా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
త్రివిధ దళాలను కాంగ్రెస్ అవమానిస్తోందని అన్నారు విజయ్ రూపానీ. త్రివిధ దళాల అధినేతలు చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి. ఎన్డీఏ ప్రభుత్వం మసూద్ అజార్ను విడుదల చేయడంతోనే జైషేమహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థాపించి ఉగ్రకార్యకలాపాలు నడుపుతున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలపై విజయ్ రూపానీ మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ హయాంలోనే చాలా మంది ఉగ్రవాదులు విడుదలయ్యారని చెప్పారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మరోవైపు వేర్పాటు వాదులను ప్రోత్సహిస్తోందని రూపానీ మండిపడ్డారు.
ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షాలు గుజరాత్ పుత్రులని వారిద్దరూ కలిసి భారత్ను ప్రపంచదేశాల సరసన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు విజయ్ రూపానీ. మరోవైపు దేశంలోని విపక్షాలన్నీ కేవలం మోడీని ఓడించేందుకు ఒక్కటవుతున్నాయని భాష్యం చెప్పారు.నరేంద్ర మోడీ దేశంలో రామరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు శ్రమిస్తుంటే.... మరోవైపు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఉగ్రవాదులు, నక్సల్స్, అవినీతిపరులు, మమతా, మాయావతి, అఖిలేష్ చంద్రబాబు లాంటి వారు ఒక్కతాటిపైకొచ్చి మోడీ ఓటమికోసం కృషి చేస్తున్నారని అన్నారు.