సీఏఏకు మద్దతు పలికిన ఎమ్మెల్యేపై వేటు: గీత దాటితేనంటూ మాయావతి వార్నింగ్
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్వాదీ పార్టీబీఎస్పీ) అధినేత్రి మాయావతి ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సీఏఏకు మద్దతు పలుకుతూ ప్రకటన చేశారు. దీంతో మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేటు తప్పదు..
అంతేగాక, సదరు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు క్రమశిక్షణ తప్పితే తక్షణమే చర్యలు ఉంటాయని మాయావతి ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. సీఏఏను బీఎస్పీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇప్పటికే సీఏఏను ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్రపతికి కూడా విన్నవించారు.
సీఏఏకు ఎమ్మెల్యే మద్దతు.. ప్రధానికి ధన్యవాదాలు
బీఎస్పీ ఎమ్మెల్యే రమాబాయి పరిహార్ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలుకుతూ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లా పతేరియా నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రమబాయి పరిహార్ మాట్లాడుతూ.. సీఏఏ కారణంగా భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అంతేగాక, పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ పటేల్, అమిత్ షాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇది చాలా గొప్ప నిర్ణయమని, గతంలో అధికారంలో ఉన్నవారికి ఇలాంటి చట్టాలను చేసే ధైర్యం లేదని అన్నారు. తాను, తన కుటుంబం సీఏఏకు మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ కూడా పాల్గొన్నారు.
మాయావతి ఆగ్రహం.. ఆ ఎమ్మెల్యేపై వేటు
రమాబాయి వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు పార్టీ సీఏఏను వ్యతిరేకిస్తుంటే.. ఆమె మద్దతు తెలపడంపై సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే సదరు ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా సదరు ఎమ్మెల్యే పాల్గొనకూడదని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఏఏను బీఎస్పీనే మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని, విభజించేదిగా ఉందని మాయావతి ఇప్పటికే ఆరోపణలు చేశారు. తాము సీఏఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేశామని బీఎస్పీ అధినేత్రి తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సదరు ఎమ్మెల్యే రమాబాయిని ఇప్పటికే హెచ్చరించామని, ఐనా ఆమె తన వైఖరిని మార్చుకోకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
ఆ బీఎస్పీపై ఎమ్మెల్యేపై బీజేపీ ప్రశంసలు
కాగా, సీఏఏకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన రమాబాయి పరిహార్పై బీజేపీ ప్రశంసల వర్షం కురిపించింది. సీఏఏకు మద్దతుగా రమాబాయి చేసిన వ్యాఖ్యలను బీజేపీ స్వాగతిస్తోందని పేర్కొందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రజ్నీష్ అగర్వాల్ తెలిపారు. మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా సీఏఏ దేశానికి మేలు చేసేదేనని తెలుసని, త్వరలోనే వారంతా సీఏఏకు మద్దతు పలుకుతారని చెప్పారు. ఇప్పుడిప్పుడే కొందరు బయటికి వస్తున్నారని చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసకు, వేధింపులు ఎదుర్కొని మనదేశంలోకి వచ్చిన మైనార్టీ వర్గాలకు చెందిన శరణార్థులకు భారతదేశ పౌరసత్వం ఇచ్చేందుకు పౌరసత్వ సవరణ చట్టం చేయడం జరిగింది.