‘పాక్ ముస్లిం అద్నాన్ సమీకి పౌరసత్వం, పద్మశ్మీ ఇచ్చారు: ఇంకెందుకు సీఏఏ?’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ దేశానికి చెందిన ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి భారత పౌరసత్వంతోపాటు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చినప్పుడు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఈ చట్టం తీసుకొచ్చారని ఆరోపించారు.
అద్నాన్ సమీకి పౌరసత్వం ఇవ్వడాన్ని తాను వ్యతిరేకించినట్లు తెలిపారు దిగ్విజయ్. అయితే, అతనికి పౌరసత్వం, పద్మశ్రీ రావడం పట్ల తాను సంతోషం వ్యక్తం చేశానని చెప్పుకొచ్చారు. ఓ పాకిస్థానీ ముస్లింకు పౌరసత్వం ఇచ్చినప్పుడు సీఏఏ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్లు అని దిగ్విజయ్ ప్రశ్నించారు.
అద్నాన్ సమీకి మోడీ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై మరో కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్గిల్ యుద్ధ వీరుడు మొహమ్మద్ సన్నౌల్లాను అస్సాంలో ఎన్ఆర్సీ నిర్వహించి విదేశీయుడిగా ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ పైలట్కు ఎలా భారత అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేస్తారని నిలదీశారు. ఇదేనా న్యూ ఇండియా అంటే అని ప్రశ్నించారు.
కేంద్రం శనివారం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో అద్నాన్ సమి పేరు కూడా ఉంది. కాగా, మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా అద్నాన్ సమీని గుర్తించింది కేంద్ర హోంశాఖ. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అధికారి కుమారుడైన సమి లండన్లో జన్మించారు. ఆ తర్వాత భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రముఖ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. సమి 2015లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా.. జనవరి 2016లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని ఇచ్చింది.