'నేను చనిపోతే ముఖ్యమంత్రిదే బాధ్యత', వీడియోలో రౌడీషీటర్ బాంబ్ నాగ
రౌడీషీటర్ నాగరాజు అలియాస్ బాంబ్ నాగ పాత నోట్ల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆ కేసులో అప్పటినుంచి పరారీలో ఉన్న నాగరాజు ఒక వీడియోను విడుదల చేశాడు. తాను చనిపోతే అందుకు బాధ్యత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యదే
బనశంకరి: బెంగళూరులో ఇటీవల రౌడీషీటర్ వి.నాగరాజు అలియాస్ బాంబ్ నాగ ఇంట్లో రూ. 14.80 కోట్ల పాత నోట్లు దొరికిన కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆ కేసులో అప్పటినుంచి పరారీలోనున్న నాగరాజు ఒక వీడియోను విడుదల చేశాడు.
నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు మంజునాథ్, మరో ఐదుగురు ప్రైవేటు వ్యక్తుల పేర్లను ప్రస్తావించాడు.
హోంమంత్రి చెబితే లొంగిపోతా...
మంగవారం మరో సీడీ ని బాంబ్ నాగ విడుదల చేశాడు. ఆ సీడీలో రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ చెబితే పదినిమిషాల్లో పోలీసుల ముందు లొంగిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యాయవాది శ్రీరామరెడ్డితో ఈ రెండో సీడీ విడుదల చేయించిన బాంబ్ నాగ ఆ సీడీలో కొన్ని సంచలనం రేకేత్తించే విషయాలు చెప్పాడు.
విధానసౌధ ముందే ప్రాణం తీసుకుంటా...
మంత్రి పరమేశ్వర్కు మాత్రమే తన బాధ అర్థమైందని పేర్కొన్న రౌడీ నాగ తాను గనుక చనిపోతే దానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే భాద్యులని వ్యాఖ్యానించాడు. తాను విధానసౌధ ముందే చనిపోతానని, తన చావుకు సిద్ధరామయ్యే కారణమన్నాడు. తాను విధానసౌధ వద్దకు వచ్చి ఏ అఘాయిత్యానికైనా పాల్పడతానని హెచ్చరించాడు.
రాష్ట్రం పరువు పోకుండా కాపాడండి...
సీఎం సిద్ధరామయ్య చెడు ఐపీఎస్ అధికారులను తొలగించాలని బాంబ్ నాగ కోరాడు. రౌడీనాగ పట్ల సీబీఐ విచారణ చేపడితే రాష్ట్రం పరువు పోతుందని పేర్కొన్నాడు. ‘మీరు సీఎం.. రాష్ట్రం పరువు పోకుండా కాపాడండి..' అని బాంబు నాగ మనవి చేశాడు. తాను తమిళనాడులో పుట్టడమే నేరమని, బెంగళూరు తమిళులు తనను ఎమ్మెల్యేగా గెలిపించకుండా మోసం చేశారని బాంబ్ నాగ వాపోయాడు. వచ్చే 2018 ఎన్నికల్లో పోటీచేయనని తెలిపారు. ప్రస్తుతం తను ఈ పరిస్థితిలో ఉండటానికి తమిళులే కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు.
నా మీద కేసులు అవాస్తవం...
తనపై 40 నుంచి 50 కేసులు ఉన్నాయని మీడియాలో వార్తలు రావటం అవాస్తవమని బాంబ్ నాగ వీడియోలో పేర్కొన్నాడు. తనపై ఎలాంటి కేసులు లేవని, రూ. 100, 200 జరిమానా చెల్లించిన కేసులు అని స్పష్టం చేశాడు. తనకు రౌడీ అనే పదానికి అర్థమే తెలియదని అతడు వ్యాఖ్యానించాడు.
నోట్ల దందాలో వాళ్లూ భాగస్వాములే...
పాతనోట్ల దందాలో కొంతమంది సీనియర్ అధికారులు భాగస్వాములుగా ఉన్నారని కూడా బాంబ్నాగ ఆరోపించారు. జీతాలు చాలకపోవడంతో పోలీసులు దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయడంతో బాంబ్ నాగ కేసు సవాల్గా మారింది. బాంబ్నాగ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని హోంమంత్రి పరమేశ్వర్ మంగళవారం స్పష్టం చేశారు.