జిలేబి తింటే కాలుష్యం పెరుగుతుందా..? అయితే ఆపేస్తా.. ఆప్పై గంభీర్ గరం.. గరం...(వీడియో)
బీజేపీ ఎంపీ కనబడుట లేదనే పోస్టర్లపై గౌతమ్ గంభీర్ స్పందించారు. తన పోస్టర్లపై దుమారం రేగిన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో శుక్రవారం వాయు కాలుష్యంపై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం జరిగింది. ఆ మీటింగ్కు తూర్పు ఢిల్లీ ఎంపీ గంభీర్ హాజరుకాలేదు. కీలకమైన సమావేశానికి డుమ్మా కొట్టడంతో గంభీర్ కనిపించడం లేదని పోస్టర్లు వెలిశాయి.
గంభీర్ డుమ్మా..
ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి స్థానిక ఎంపీ గౌతం గంభీర్ డుమ్మా కొట్టారు. అయితే ఆ రోజు ఆయన ఇండోర్ వెళ్లారు. వ్యక్తిగత పనుల కోసమని చెప్పారు. కానీ ఇండోర్లో మాజీ క్రికెటర్, గంభీర్ సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్, ఇతర మిత్రుడుతో కలిసి జిలేబి తింటున్న ఫోటో ఒకటి కనిపించింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. దీంతో గంభీర్ రియాక్టరయ్యారు.
జిలేబి తింటే..
తాను జిలేబీ తినడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందా అని గంభీర్ ప్రశ్నించారు. ఒకవేళ నిజంగా కాలుష్యం పెరిగితే.. తాను జిలేబీ తినడం మానేస్తానని చెప్పారు. కానీ కొందరు జిలేబీ, అటుకులు తినడమే నేరమన్నట్టు ప్రవర్తించారని అసహనం వ్యక్తం చేశారు. హస్తినలో కాలుష్య కాషరం అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకోవాలి..? మంచి గాలి రావాలంటే ఏం చేయాలనే అంశంపై చర్చించాలి, పరిష్కారం కనుగొనాలన్నారు. కానీ తాను జిలేబీ తింటే ట్రోల్ చేయడం ఏంటీ అని ప్రశ్నించారు.
తప్పుడు ప్రచారాలు..
తాను చేసే మంచి పనుల ద్వారా గుర్తింపు వస్తుంది తప్ప. తప్పుడు ప్రచారాల వద్ద కాదని ఆప్పై గంభీర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను కాలుష్యం నివారించేందుకు పాటుపడుతున్నానని గంభీర్ పేర్కొన్నారు. అంతేకాదు తన నియోజకవర్గంలో ఎయిర్ ఫ్యూరిఫైయర్లు ఏర్పాటుచేయాలని కూడా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఆ ఫోటో..
బీజేపీ ఎంపీకి మునుపు గంభీర్ క్రికెట్ వ్యాఖ్యతగా పనిచేశారు. మాజీ క్రికెటర్ కూడా. కానీ ఇటీవల వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి జిలేబి తింటున్న ఫోటో వైరలవడంపై స్పందించారు. కానీ కొందరు పనిగట్టుకొని విమర్శలు చేయడం సరికాదన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.