నేనే నియంతనైతే భగవద్గీత ప్రవేశపెట్టేవాడ్ని: సుప్రీం జడ్జి
అహ్మదాబాద్: తాను నియంతను అయి ఉంటే కనుక పాఠశాలల్లో ఒకటో తరగతి నుండే భగవద్గీతను, మహాభారతాలను ప్రవేశ పెట్టే వాడినని సుప్రీం కోర్టు న్యాయమూర్తి దవే శనివారం అన్నారు. ఆయన అహ్మదాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
భారతీయులు తమ పురాతన సంప్రదాయాల వైపు మళ్లాలని అభిప్రాయపడ్డారు. పురాతన గురుశిష్య బంధం ఇప్పుడు కనిపించడం లేదన్నారు. అవే ఉంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభించేందన్నారు. పిల్లలకు చిన్న వయసు నుండే భగవద్గీత, మహాభారతాలను పరిచయం చేయాలన్నారు.
లౌకికవాదులు తన అభిప్రాయంతో ఏకీభవించక పోవచ్చునని ఆయన చెప్పారు. తానే కనుక నియంతను అయి ఉంటే వాటిని పాఠ్యాంశాల్లో ప్రవేశ పెట్టే వాడినని చెప్పారు.
ఎవరైనా లౌకికవాదా.. కాదా అనే విషయం కాదని, మంచి ఎక్కడున్నా దానిని స్వీకరించాలని హితవు పలికారు. తీవ్రవాదమననేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. ప్రతి మనిషిలోని మంచి అంశాలన్నింటిని వెలికితీయగలిగితే... హింస అనేది పత్తా లేకుండా పోతుందన్నారు.