రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది: పాక్-భారత్ టెన్షన్పై మోడీ
న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్స్ లేని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పాకిస్తాన్ - భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగ్ విమానాలు కూలిపోతున్నాయని, రాఫెల్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని భారతీయులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మోడీ కూడా స్పందించారు. ప్రస్తుతం మన చేతిలో రాఫెల్ యుద్ధ విమానాలు ఉండివుంటే పరిస్థితులు మరోరకంగా ఉండేవని ఆయన అన్నారు. ఈ తరహా యుద్ధ విమానాలు భారత్ వద్దలేకపోవడం పెద్ద లోటు అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రస్తుతం మన వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల యావత్ దేశం బాధపడుతోందన్నారు.
ఆ విమానాలు మన వద్ద ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదన్నారు. ప్రస్తుతం దేశమంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్న మాట ఇదేనని చెప్పారు. రాఫెల్ విమానాల విషయమై గతంలోనూ ఇప్పుడు కొనసాగుతున్న స్వార్థ రాజకీయాల వల్ల దేశం చాలా నష్టపోయిందన్నారు. తనను విమర్శించే స్వేచ్ఛ విపక్ష నేతలకు ఉన్నదని, అయితే ఆ విమర్శలు మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులకు ఉపయోగపడవద్దన్నారు.
కొంతమంది వ్యక్తులు తమ సొంత దేశాన్నే వ్యతిరేకిస్తున్నారని మోడీ అన్నారు. మన దేశం ముందున్న పెద్ద సవాళ్లలో ఇది ఒకటి అన్నారు. ఇప్పుడు మన దేశమంతా సాయుధ బలగాలకు అండగా నిలిచిందన్నారు. కానీ కొన్ని పార్టీలు మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను శంకిస్తున్నాయన్నారు.