కర్ణాటక రిజల్ట్స్: గోవా తరహలోనే ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్స్: కాంగ్రెస్
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వనిస్తారనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బిజెపిని ఆహ్వనించిన సందర్భం గత ఏడాది చోటు చేసుకొంది. ఈ తరుణంలో కర్ణాటకలో కూడ ఇదే రకమైన పరిస్థితులు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమికి అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.
కర్ణాటలో 222 అసెంబ్లీ స్థానాల్లో వచ్చిన ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని జెడి(ఎస్), కాంగ్రెస్ కూటమి భావిస్తోంది. రాజ్యాంగం ప్రకారం తమ కూటమినే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని కర్ణాటక మాజీ సీఎం, బిజెపి నేత యడ్యూరప్ప గవర్నర్ ను మంగళవారం నాడు కలిసి వినతిపత్రం సమర్పించారు. జెడి(ఎస్)లోని రేవణ్ణతో పాటు మరో 12 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తారని గవర్నర్ ను కోరారు. అయితే బుధవారం నాడు ఈ విషయమై రేవణ్ణ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. జెడి(ఎస్)లో ఎలాంటి చీలిక లేదన్నారు.
అయితే కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జెడి(ఎస్) , కాంగ్రెస్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
1998లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణ వాజ్పేయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వనించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల ముందు ఏ పార్టీకి మద్య పొత్తులేని పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాని నేపథ్యంలో సంకీర్ణ పార్టీలు లేదా కూటమికి చెందిన లేదా పార్టీకి చెందిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వనిస్తారని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది.
కర్ణాటకలో కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమి సంకీర్ణ కూటమి 56 శాతం ఓట్ల శాతాన్ని పొందిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఇదే తరహలో 2017 లో గోవా, మణిపూర్ లలో బిజెపిని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది. మరోవైపు 2018లో మేఘాలయాలో కూడ బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.