బీజేపీ నినాదం మారాల్సిందే: 2019లో మోడీని ఢీకొట్టేది కేజ్రీయేనా?
న్యూఢిల్లీ: మినీ ఇండియాగా పేరుగాంచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 గెలుచుకుంటుందని ఎవరు ఊహించలేదు. విపక్షాల మద్దతు, బీజేపీలోని విభేదాలు, ఏఏపీ వైపు మధ్యతరగతి మొగ్గటం వంటి కారణాలతో సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పైన అప్పుడే లెక్కలు వేస్తున్నారు.
2019 లోకసభ ఎన్నికల నాటికి ప్రధాని నరేంద్ర మోడీకి కేజ్రీవాల్ అతిపెద్ద సవాల్గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అవినీతిలేని రాజకీయాలు, స్వచ్ఛ పాలన తదితరాలతో కేజ్రీవాల్.. మోడీకి ధీటుగా నిలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక నుండి జాతీయ రాజకీయాల్లో బీజేపీకి గట్టి పోటీదారు కాంగ్రెస్ కాదని... ఏఏపీ అవుతుందని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల నుండి కాంగ్రెస్ క్రమంగా బలహీనమవుతోంది. బీజేపీ బలపడుతోంది. తద్వారా బీజేపీకి గట్టిపోటీ లేకుండా పోయింది. ఢిల్లీ ఎన్నికల ద్వారా ఇప్పుడు బీజేపీకి మరో గట్టి ప్రత్యర్థి కనిపించారు. ఇక నుండి కాంగ్రెస్కు బదులు కేజ్రీ హవా కనిపిస్తుందని అంటున్నారు.
ఏఏపీ 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం మూడింట మాత్రమే గెలిచింది. ఏఏపీ సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నం. అలాగే ఉంటే ఆ పార్టీ పూర్తికాలం కొనసాగుతుంది. సంప్రదాయ రాజకీయ పార్టీల్లాగే సంక్షోభం వస్తే మాత్రం...? ఆ పార్టీ ఎంతకాలం మనగలుగుతుందనే ప్రశ్న ఉదయిస్తుంది. అయితే, అలాంటి దానికి ఛాన్సు లేదని కొట్టి పారేసేవారు ఎక్కువ ఉన్నారు.
అయితే, ఏఏపీలో పని చేసిన వారే ఇటీవల బీజేపీలో చేరిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. అలాంటి వాటిని కొట్టిపారేయలేమని చెప్పేవారు కూడా లేకపోలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తికాలం.. ఉంటే వచ్చే లోకసభ ఎన్నికల నాటికి మోడీ, కేజ్రీల మధ్యనే గట్టి పోటీ ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
ఇద్దరికీ పట్టణ ఓటర్లే...
బీజేపీ బలం మొదటి నుండి పట్టణ ఓటర్లు. వారి ద్వారానే ఈ స్థాయికి ఎదిగిందని చెప్పవచ్చు! ఇప్పుడు ఏఏపీ కూడా పట్టణ ఓటర్ల నుండి పుట్టుకు వస్తోంది. ఏఏపీ వల్ల పట్టణ ఓటర్లు బీజేపీ నుండి మరలుతున్నారు. అది కమలానికి నష్టమే. గతంలో కాంగ్రెస్ పార్టీ రోడీ, కపడ, మకాన్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది. ఆ తర్వాత బీజేపీ బిజ్లీ, సడక్, పానీ అంటూ ప్రజల్లోకి వెళ్లి గెలిచింది. ఇప్పుడు అభివృద్ధిని పలవరిస్తున్నారు.
వారి దారిలోనే ఏఏపీ కూడా ప్రజలకు నీరు, విద్యుత్, వైఫై వంటి వాటితో ఓటర్లను ఆకట్టుకుంది. ముఖ్యంగా అవినీతిలేని పాలన పేరుతో అర్బన్, చదువుకున్న ఓటర్లను ఆకట్టుకుంది. ఏఏపీ పట్టణ ఓటర్లను ఆకట్టుకోవడం బీజేపీకి ఇబ్బందికర పరిణామమే.
బీజేపీ మరో నినాదం వెతుక్కోవాలా?
హిందుత్వం వంటి అంశాలు బీజేపీకి ముఖ్య నినాదాలు. అదే సమయంలో ఏఏపీకి క్లీన్ ఇమేజ్ ఉంది. ఏఏపీ రాకతో కాంగ్రెస్, ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి నేతలను దాటి కేజ్రీవాల్.. మోడీకి సవాల్గా వస్తే బీజేపీ మరో నినాదం వెతుక్కోవలసి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ వంటి పార్టీల స్యూడో సెక్యులరిజం వల్లనే బీజేపీ ఎదిగిందనే భావన చాలామందిలో ఉంది. అలాంటి పార్టీలు కాకుండా ఏఏపీ వంటి పార్టీలు తమకు పోటీగా నిలబడితే.. అప్పుడు బీజేపీకి హిందుత్వ నినాదం పని చేయకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. అప్పుడు బీజేపీ మరో కొత్త పాయింట్ వెతుక్కోవాల్సిందేనని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో జాతీయస్థాయిలో ఏఏపీ వర్సెస్ బీజేపీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ పంజాబ్, బీహార్, పశ్చిమ బెంగాల్ పైన దృష్టి సారించింది. అలాగే ముఖ్యనగరాలలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయస్థాయిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ప్రజలకు ఇప్పటికే కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. ఇది ప్రాంతీయ పార్టీలకు కూడా నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు.
క్లీన్ ఇమేజ్ పేరుతో కేజ్రీవాల్ దూసుకువస్తే.. జాతీయ స్థాయి ప్రాధాన్యత కోసం, ప్రాంతీయ పార్టీలను కాదని బీజేపీ వైపుకు మరలే వారు ఉంటారని అంటున్నారు. మరోవైపు 2019 నాటికి వ్యతిరేకత కేజ్రీవాల్ కంటే మోడీకే ఎక్కువ ఉంటుంది. ఢిల్లీ చిన్న ప్రాంతం. దీంతో కేజ్రీ పైన వ్యతిరేకత తక్కువగా ఉంటుందని, అదే మోడీ ప్రధాని కాబట్టి ఆయన పైనే వ్యతిరేకత ఎక్కువగా ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. అయితే, అది కేజ్రీవాల్ పాలనను బట్టి కూడా ఉంటుందంటున్నారు.