అయోధ్య కేసు : మధ్యవర్తులు నివేదిక ఇవ్వండి.. జులై 25 నుంచి వాదనలు వింటామన్న సుప్రీం..
ఢిల్లీ : రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ స్థల వివాదం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ వివాద పరిష్కారానికి సంబంధించి మధ్యవర్తిత్వం ఫలించకపోతే జూలై 25 నుంచి వాదనలు వింటామని స్పష్టం చేసింది. కేసు విచారణ త్వరితగతిన చేపట్టాలన్న పిటీషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం జులై 18లోగా నివేదిక సమర్పించాలని మధ్యవర్తిత్వ కమిటీకి ఆదేశించింది. ఒకవేళ మీడియేషన్ ఫలించే అవకాశాలు కనిపించకపోతే.. కేసు విచారణను జులై 25 నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
అయోధ్య స్థల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే అవకాశాన్ని పరిశీలించాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం మే 10న ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే అయోధ్య కేసులో తీర్పును త్వరగా వెల్లడించాలని సీనియర్ అడ్వొకేట్ పరసరన్ పిటీషన్ దాఖలు చేశారు. మధ్యవర్తి నివేదికతో ఒరిగేదేమీ ఉండదని, ఈ కేసు విషయంలో కోర్టే కొత్త తేదీ ప్రకటించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అయోధ్య భూవివాదానికి సంబంధించి పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్ఎం కలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇరు వర్గాలతో చర్చించి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించే అవకాశాలు పరిశీలించాలని న్యాయస్థానం ఈ కమిటీకి సూచించింది. ఈ నేపథ్యంలో జులై 18న కమిటీ ఇవ్వనున్న నివేదిక ఆధారంగా కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.