ఓబీసీ అయ్యుంటే ఆర్ఎస్ఎస్ ఛాన్సిచ్చేదా?
లక్నో : ప్రధాని నరేంద్రమోడీపై బీఎస్పీ చీఫ్ మాయావతి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఎస్పీ బీఎస్పీ కూటమి కుల ప్రాతిపదికన ఏర్పాటైందన్న ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బెహన్ జీ మోడీ కుల అంశాన్ని ప్రస్తావించారు. పుట్టుకతోనే నరేంద్రమోడీ ఓబీసీ కాదన్న ఆమె.. ఆయన ఏనాడూ కుల వివక్ష ఏదుర్కోలేదని అన్నారు. కుల వివక్షకు గురైన బాధితులకు కులతత్వాన్ని అంటగట్టడం సరికాదని మాయావతి విరుచుకుపడ్డారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని సిద్దరామయ్య కూల్చేస్తారు, మాజీ ప్రధాని ఫ్యామిలీ మీద 40 ఏళ్ల పగ: అశోక్ !
ఓబీసీ అయ్యుంటే ప్రధానిని చేసేదా?
ప్రధాని మోడీ ఓబీసీ కాదని మాయావతి మరోసారి ఆరోపించారు. ఒకవేళ ఆయన నిజంగా ఓబీసీ అయి ఉంటే ఆర్ఎస్ఎస్ ఆయనకు ప్రధాని అయ్యే అవకాశం ఇచ్చేదా అని ప్రశ్నించారు. "మోడీ ఓబీసీ కాదు. అందుకే వెనుకబడిన వర్గాల ప్రజలు పడే బాధలు ఆయనకు తెలియదు. మహాకూటమి కులరాజకీయాలు చేస్తోందన్న ఆరోపణలు సరికాదు. ఒకవేళ మోడీ ఓబీసీ అయ్యుంటే ఆర్ఎస్ఎస్ ఆయనను ప్రధానిని చేసేదా" అని మాయావతి ప్రశ్నించారు.
మోడీకి ఓటమి భయం
ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ చేస్తున్న ఆరోపణలను బీఎస్పీ చీఫ్ మాయావతి తిప్పికొట్టారు. ఓటమి భయంతోనే ఆయన ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. మోడీ వాడుతున్న బాషలో ఆయన ఓటమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అన్నారు. మరోసారి ప్రధాని కావాలని మోడీ కంటున్న కలలు ఎప్పటికీ నిజం కావన్నారు మాయావతి.
అవినీతిలో కాంగ్రెస్తో పోటీ
అవినీతి విషయంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్తో పోటీ పడుతోందని మాయావతి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు దళితుల మద్దతుతో అధికారంలోకి వచ్చినా వారి గురించి ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. మోడీ సొంతరాష్ట్రం గుజరాత్లో దళితులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపలేకపోతున్నారని అన్నారు.