ప్రభుత్వ ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్.. మూడు లేఖలు సిద్ధం చేసిన కాంగ్రెస్ హైకమాండ్
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరికొన్ని గంటల్లో ఫలితం తేలనుంది. 2019 రేసులో విన్నరెవరో, రన్నరెవరో తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి కొండంత బలం ఇవ్వగా... ప్రతిపక్ష పార్టీలు సైతం విజయంపై ధీమాతో ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ క్లియర్ మెజార్టీ సాధిస్తుందని అంచనాలు వెలువడినప్పటికీ ఒకవేళ బీజేపీ మేజిక్ ఫిగర్ను చేరని పక్షంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేసింది. ఎన్డీఏ 272 సీట్లు సాధించకపోతే వెంటనే రంగంలోకి దిగి ప్రతిపక్షాలే ప్రభుత్వం ఏర్పాటుచేసేలా త్రీ స్టేజ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించింది.
లడ్డూ కేక్లు, లోటస్ స్వీట్లు.. గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్కు బీజేపీ రెడీ..
మూడు లేఖలు సిద్ధం చేసిన కాంగ్రెస్
ఫలితాల అనంతరం ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ లీగల్ టీం మూడు లేఖలని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సాధారణ మెజార్టీకి దూరంలో నిలిస్తే కాంగ్రెస్.. బీజేపీయేతర పక్షాలతో కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తుందని సమాచారం. దీనికి యూపీఏ ప్లస్ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కూటమిలోని అన్ని పార్టీల నేతల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అందజేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ లేఖతో పాటు మరో రెండు లెటర్లను పార్టీ హైకమాండ్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తమ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, కొత్త కూటమి ఛైర్మన్ ఎవరన్న అంశంపై ఆ లెటర్లలో స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
ప్రధానిగా ప్రాంతీయ పార్టీ నేత?
లేఖల డ్రాఫ్టింగ్లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడిన కోర్ టీం పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ పటేల్, జైరాం రమేషన్, రాహుల్ గాంధీ సన్నిహితుడు కె.రాజు తదితరలు ఈ టీంలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ లేఖల అంశంపై స్పందించేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. ఇదిలాఉంటే బీజేపీ అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు కర్నాటక తరహా ఫార్ములాను అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నదని సమాచారం. ఈ క్రమంలో కూటమిలోని నాయకులందరి ఏకాభిప్రాయంతో ప్రాంతీయ పార్టీకి చెందిన నేతను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నేతలు
కాంగ్రెస్ అంతర్గత విశ్లేషణ ప్రకారం పార్టీకి 120 నుంచి 140 సీట్లు రానున్నాయి. రీజినల్ పార్టీలతో కలుపుకుని మేజిక్ ఫిగర్ను ఈజీగా చేరుకోవచ్చని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి ప్రభంజనం సృష్టించే అవకాశముందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు, మద్దతిచ్చేందుకు ఆ కూటమి సిద్ధంగా ఉందన్న వార్తలు కాంగ్రెస్కు వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. వారిరువురు ఇప్పటికే అఖిలేష్ యాదవ్, మాయావతి, మమత బెనర్జీతో పాటు ఇప్పటి వరకు ఏ కూటమికి మద్దతు ప్రకటించని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ తదితరులతో సంప్రదించినట్లు తెలుస్తోంది. వారంతా కాంగ్రెస్కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమాతో ఉంది.