ఆ గుర్తుమీద తప్ప ఏ గుర్తు మీద నొక్కినా షాక్ కొట్టి ఛస్తారు..! కాంగ్రెస్ అభ్యర్థి విచిత్ర బెదిరింపు..
రాయ్పుర్/హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో నేతల విచిత్ర విన్యాసాలు, వింత వ్యాఖ్యానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఓ పార్టీకి చెందిన నేతలు తమకు ఓటు వేయకపోతే శాపం తగులుతుందని చెప్పుకు రాగా మరో నేత ఉద్యోగం కావాలంటే తనకే ఓటేయాలని హుకుం జారీ చేసారు. తాజాగా కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యప్తంగా చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడంతో పాటు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఛత్తీస్గఢ్ ఎక్సైజ్, వాణిజ్యం, పరిశ్రమ శాఖ మంత్రి కవాసి లక్మా చేరారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో మొదటి మీట కాకుండా వేరేది నొక్కితే ఎలక్ట్రిక్ షాక్ తగులుతుందని హెచ్చరించారు. బుధవారం ఓ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. వాటిపై వివరణ కోరుతూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తోన్న లఖ్మా మాట్లాడుతూ..'మీరు ఈవీఎంలో మొదటి మీట నొక్కండి. మీరు రెండో మీట నొక్కితే దాంట్లో ఉన్న కరెంట్ వల్ల మీకు షాక్ కొడుతుంది. మీరు మూడో మీట నొక్కినా అదే జరుగుతుంది' అని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లో రెండో దశ పోలింగ్కు ఒకరోజు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.