మూడు కోవిడ్ కేసులు నమోదైతే.. కంటైన్మెంట్ జోన్గా మొత్తం అపార్ట్మెంట్
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఐటీ హబ్ బెంగళూరులో కేసులు భారీగా పెరుగుతున్నాయి. బెంగుళూరులో పాజిటివిటీ రేటు 16 శాతంగా ఉండటం గమనార్హం. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇది 11శాతంగా ఉంది. గత వారంనాటితో పోల్చితే బుధవారంనాటు కర్ణాటకలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 50శాతం పెరిగింది.
కర్ణాటకలో 21,390 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఒక్క బెంగుళూరులోనే 15,617 కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్ణాటకలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువగా.. 93,099కి చేరింది. ఇందులో 78శాతం (73,654) బెంగుళూరులోనివే కావడం గమనార్హం. రాష్ట్రంలో 10 మంది కరోనా బారినపడి మృతి చెందగా, వీరిలో ఏడుగురు బెంగుళూరుకు చెందినవారే ఉన్నారు.

ఈ నేపథ్యంలో కరోనా కట్టడి దిశగా బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగుళూరులోని ఏదైనా అపార్ట్మెంట్లో మూడుకు పైగా కోవిడ్-19 కేసులు నమోదైతే.. మొత్తం అపార్ట్మెంట్ను 'కంటైన్మెంట్ జోన్'గా ప్రకటించనున్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వారం రోజుల పాటు సదరు అపార్టుమెంట్ను కంటైన్మెంట్ జోన్లో ఉంచనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
ఇక, అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి, కాంట్రాక్ట్ ట్రేసింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తమ నిర్ణయానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, క్వారంటైన్లో ఉండాల్సిన వ్యక్తులు రోడ్డు మీద ఇష్టానుసారం సంచరించకుండా చూడాల్సిన బాధ్యత రెసిడెన్షియల్ వెల్ఫేర్ అపార్ట్మెంట్ల మీదే ఉంటుందని బీబీఎంపీ స్పష్టం చేసింది.
కాగా, థర్డ్ వేవ్లో బెంగళూరులో 212 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. వీరిలో 12 మంది ఇప్పటికే కోలుకోగా.. మిగిలినవారు హోం ఐసొలేషన్లో ఉన్నారు. ఫస్ట్ వేవ్లో 4,083 మంది పోలీసులు, సెకండ్ వేవ్లో 1,905 మంది పోలీసులు కోవిడ్ బారినపడ్డారు. కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ తదితరులు కరోనా బారినపడ్డారు. కరోనా ఉధృతి నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా పలు ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.