గుర్తించలేకపోవడం మా తప్పే.. ఒప్పుకుంటాం: పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా
న్యూఢిల్లీ: రూ.11,400 కోట్ల స్కాం 2011 నుంచీ జరుగుతోంటే ఎందుకు గుర్తించలేకపోయారని విలేకరులు ప్రశ్నించగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా సమాధానం చెప్పలేకపోయారు.
Recommended Video
చదవండి: పీఎన్బీ స్కాం: ఇలా బయటపడింది.. కుప్పకూలిన బ్యాంక్ షేరు, ఇక ఇప్పుడేం జరుగుతుంది?
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబై బ్రాంచిలో భారీ స్కాం నేపథ్యంలో ఆ బ్యాంక్ ఎండీ సునీల్ మెహతా గురువారం మధ్యాహ్నం అధికారికంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఈ లావాదేవీలు బ్యాంకు రికార్డుల్లోకి ఎక్కకపోవడం వల్ల తాము గుర్తించలేకపోయామని, తాము జనవరి మొదటి వారంలో గుర్తించగానే సీబీఐకి ఫిర్యాదు చేశామని, ఒకవేళ దర్యాప్తు సంస్థలు తప్పు తమదేనన్నా తాము ఒప్పుకుంటామని పేర్కొన్నారు.
ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తుందని, నేరస్థులను అరెస్టు చేసే ప్రయత్నాలకు పూర్తిగా మద్దతిస్తోందని మెహతా అన్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడగలమన్న నమ్మకం తమకు ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ బ్యాంకు శాఖ నుంచి కొల్లగొట్టిన డబ్బును తిరిగి చెల్లించేందుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ వద్ద గట్టి ప్రతిపాదనలేమీ లేవని, వారు సమర్పించిన ప్రణాళికలు కూడా అస్పష్టంగా ఉన్నాయని మెహతా చెప్పారు.
ఈ స్కాంలో తమ బ్యాంకు శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగుల ప్రమేయం ఉందని, దీనిపై తాము జనవరి 29న సీబీఐకి ఫిర్యాదు చేశామని, సీబీఐ 31న కేసు నమోదు చేసిందని తెలిపారు. 'మేం జనవరి 3న ఈ అక్రమ లావాదేవీలను గుర్తించాం. ఇందులో పెద్దా చిన్నా తేడా లేదు, ఉన్నతస్థాయి వ్యక్తులు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు..' అని స్పష్టం చేశారు.
మరోవైపు వ్యాపారి నీరవ్ మోడీ, అతడి సోదరుడు బెల్జియం పౌరసత్వం కలిగిన నిషాల్ జనవరి 1నే విదేశాలకు పారిపోగా, ఈ స్కాంలో మరో నిందితుడైన మెహుల్ చోక్సీ జనవరి 4న, నీరవ్ మోడీ భార్య, అమెరికా పౌరసత్వం కలిగిన అమీ జనవరి 6న దేశం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం.