బీహార్లో ఆర్జేడీ గెలిస్తే... కశ్మీరీ ఉగ్రవాదులకు ఇక ఇదే అడ్డా... : కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికలను ఉద్దేశించి కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) గనుక విజయం సాధిస్తే... రాష్ట్రం కశ్మీరీ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైశాలి మహనార్ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఆర్జేడీ ఆయన బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
నిత్యానంద రాయ్ ఏమన్నారు...
'ఓవైపు ఎన్డీయే ప్రభుత్వం కశ్మీర్లో ఉగ్రవాదులను ఏరిపారేస్తోంది. కానీ బీహార్లో ఆర్జేడీ అధికారంలోకి వస్తే కశ్మీర్ ఉగ్రవాదులంతా ఇక్కడే ఆశ్రయం పొందుతారన్న భయం నన్ను వెంటాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకుండా చూసుకునే బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ,హోంమంత్రి అమిత్ షా నాకు అప్పగించారు. కాబట్టి బీహార్లోకి ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ చొరబడనివ్వం..' అని నిత్యానంద రాయ్ తెలిపారు.
ఆ ఇద్దరి బలం మీపై ఆధారపడి ఉంది.. : నిత్యానంద రాయ్
'ఎన్డీయే ప్రభుత్వం కశ్మీర్లో 370,35ఏ ఆర్టికల్స్ను రద్దు చేసింది. అటు చైనా చర్యలను మన బలగాలు గట్టిగా తిప్పి కొడుతున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో మన బలగాలు వేరే దేశాలతో పోరాడేందుకు అన్ని విధాలుగా సంసిద్దంగా ఉన్నాయి. కానీ దేశంలో అంతర్గతంగా తలపడాల్సి వస్తే... మోదీ,షాల బలం మీపై ఆధారపడి ఉంది. కాబట్టి మీరంతా బీజేపీ,ఎన్డీయేలకు ఓటు వేసి ఆ ఇద్దరినీ మరింత బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను.' అని నిత్యానంద రాయ్ పేర్కొన్నారు.
Recommended Video
ఖండించిన ఆర్డేడీ.. క్షమాపణలకు డిమాండ్...
మరోవైపు కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఆర్జేడీ తీవ్రంగా ఖండించింది. ఒక కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని... ఆయన వెంటనే బీహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆర్జేడీ నేత చిత్రంజన్ గగన్ డిమాండ్ చేశారు. 'ఎన్నికల ర్యాలీల్లో ఏ రకమైన భాష మాట్లాడుతున్నారు... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కనీసం ఆ పదవికైనా గౌరవం ఇవ్వరా.. ఆయన వ్యాఖ్యలు బీహార్ ప్రజలను అవమానించడమే. తక్షణమే బీహార్ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పి తీరాలి..' అని చిత్రంజన్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు ఫ్రస్టేషన్ ఎక్కువైపోయిందని... అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.