శశికళ తమిళనాడు సీఎం అయితే, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఏం చెప్పారంటే !
చెన్నై: తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్న సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎంగా శశికళ నటరాజన్ సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని శనివారం సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు.
తమిళనాడు సీఎం పీఠంపై శశికళ కన్నేసిన విషయంపై గతంలోనే బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శశికళ ఎలాగైన తమిళనాడు సీఎం కావడానికి పావులుకదుపుతున్నారని సుబ్రమణ్యస్వామి గతంలో చాలాసార్లు చెప్పారు.
అయితే ప్రస్తుతం తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే సుబ్రమణ్యస్వామి చేసిన ట్వీట్ ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వం వర్గీయుల్లో కలవరంరేపింది. మొదట శశికళ ఫిబ్రవరి 9వ తేది గురువారం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వార్తలు గుప్పుమన్నాయి.
తమిళనాడు సీఎంగా శశికళ: ఫిబ్రవరి 6 ముహూర్తం ! పన్నీర్?
ఆదివారం శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని ఇప్పటికే ఖరారు చేశారు. అయితే ఆలస్యం చేస్తే పార్టీలో అసమ్మతి వర్గం చిన్నమ్మను సీఎం కానివ్వకుండా అడ్డుకుంటారని ఆమె అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం కాకుండా సోమవారం శశికళను తమిళనాడు సీఎం చెయ్యాలని శనివారం నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అవును శశికళ సీఎం అవుతున్నారు అని ట్వీట్ చెయ్యడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. అప్పుడే శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళనలు చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.