లోక్ సభ ఎన్నికల్లో తెలుగింటి ఆడపడుచు సుమలత పోటీ, సీఎం కుమారుడు నిఖిల్ కు చెక్ !
బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య నియోజక వర్గం నుంచి రెబల్ స్టార్ అంబరీష్ భార్య, తెలుగింటి ఆడపడుచు సుమలత పోటీ చేస్తారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. సుమలతకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ చిక్కితే కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ కు పూర్తి ప్రచార భాద్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. మండ్య ప్రజల ఒత్తిడి మేరకు సుమలత అంబరీష్ రాజకీయాల్లోకి వస్తున్నారని సమాచారం.
చిత్ర పరిశ్ర మద్దతు
సుమలత అంబరీష్ రాజకీయాల్లోకి వస్తే చాలెంజింగ్ స్టార్ దర్శన్ తో పాటు కన్నడ చలన చిత్ర పరిశ్రమ సంపూర్ణ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. మండ్య జిల్లా ప్రజల ఒత్తిడి మేరకు సుమలత అంబరీష్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించారని సమాచారం. ఫిబ్రవరి 11వ తేదీ సుమలత అంబరీష్ తన తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు.
సిద్దరామయ్యతో చాలెంజింగ్ స్టార్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చాలెంజింగ్ స్టార్ దర్శన్ భేటీ అయ్యి చర్చలు జరిపారు. రెబల్ స్టార్ అంబరీష్ కు అత్యంత సన్నిహితుడు అయిన హీరో దర్శన్ సుమలత అంబరీష్ కు మండ్య సీటు కేటాయిస్తే పూర్తి ప్రచార భాద్యతలు తాను తీసుకుంటానని దర్శన్ సిద్దరామయ్యకు హామీ ఇచ్చారని తెలిసింది.
సీఎం కుమారుడు పోటీ ?
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు , హీరో నిఖిల్ గౌడ మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మండ్య నియోజక వర్గంలో జేడీఎస్ కు మంచి పట్టు ఉంది. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కచ్చితంగా పోటీ చేస్తారని జేడీఎస్ నాయకులు అంటున్నారు. అయితే సుమలతకు మండ్య సీటు కేటాయించే విషయంలో జేడీఎస్ మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు.
వ్యతిరేకం కాదు అంటున్న సీఎం
మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి సుమలత అంబరీష్ పోటీ చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడం, పోటీ చెయ్యకపోవడం సుమలత వ్యక్తిగత విషయం అని, ఆ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ముఖ్యమంత్రి కుమారస్వామి అంటున్నారు.