దక్షిణాది ఎంపీలంతా కలిస్తే కేంద్రంలో చక్రం తిప్పమా..? జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ నజర్..!
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు డీఎంకే చీఫ్ స్టాలిన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇది కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమేనని డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. ఐతే ఫెడరల్ ఫ్రంట్ కోసం చంద్రశేఖర్ రావు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే స్టాలిన్ను కలిశారనే చర్చ జరుగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతను చంద్రశేఖర్ రావు తనదైన శైలిలో వివరించారు. దక్షిణాది ఎంపీలంతా కలిస్తే కేంద్రాన్ని శాసించవచ్చని పేర్కొన్నారు.
మనిషి హైదరాబాద్ లో .. మనసు ఢిల్లీలో..! కేంద్ర రాజకీయాల వైపు కేసీఆర్ ద్రుష్టి..!!
కానీ, ఈ భేటీలో స్టాలిన్ ముందు చంద్రశేఖర్ రావు రెండు కీలక ప్రతిపాదనలు ఉంచారని తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వాలనేది ఆయన మొదటి ప్రతిపాదనగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లొచ్చి, ప్రాంతీయ పార్టీల అవసరం పడితే.. తమకు ఉపప్రధాని పదవి, కీలక పోర్టుపోలియోలు ఇవ్వాలనేది ఆయన రెండో ప్రతిపాదనగా తెలుస్తోంది.
దక్షిణ రాష్ట్రాలను చుట్టేసిన కేసీఆర్..! ప్రాంతీయ పార్టీల ఐకమత్యం కోసం కృషి.!!
సోమవారం సాయంత్రం చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఆయన్ను కలిసిన చంద్రశేఖర్ రావు గంటన్నర సేపు ముచ్చటించారు. చాలాసేపు వారిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చంద్రశేఖర్ రావుతో చెప్పినట్టు సమాచారం. రాహుల్ ప్రధాని అవుతారని, కూటమిలోని పార్టీలు ప్రభుత్వంలో చేరతాయని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
జాతీయ పార్టీలతో నెత్తి నొప్పి..! ఫ్రంటే మేలంటున్న గులాబీ బాస్..!!
కాగా టీఆర్ఎస్ మహాకూటమిలో చేరితే తనకెలాంటి అభ్యంతరం లేదని గతవారం రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా చంద్రబాబు తెలిపారని సమాచారం. కానీ కూటమిలో టీడీపీ ఉన్నంత కాలం టీఆర్ఎస్ మిత్రపక్షమైన వైఎస్ఆర్సీపీ అటువైపు చూస్తుందని భావించలేం. తెలంగాణలో ఎక్కువ సీట్లు సాధించుకోవడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చంద్రశేఖర్ రావు ఆశిస్తున్నారు.
మే23వరకు ఆగాల్సిందే..! తర్వాత కేసీఆర్ వ్యూహం మార్చే ఛాన్స్..!!
దక్షిణాది ప్రతినిధిగా వ్యవహరించాలని చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. యూపీఏ హయాంలో చంద్రశేఖర్ రావు కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఉపప్రధాని పీఠాన్ని ఆశిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. కాలం కలిసొస్తే.. ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. చంద్రశేఖర్ రావు ప్రధాని కావాలని టీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి.