యుద్దం అనివార్యమైతే లోక్ సభ ఎన్నికలు లేనట్టే..! కీలక నిర్ణయం తీసుకోనున్న ఈసీ..!!
హైదరాబాద్ : పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ద ట్యాంకర్లను మోహరించింది. మరోవైపు భారత్ కూడా యుద్ద సన్నాహాల్లో ఉంది. సరిహద్దు వెంట ఉన్న 5 కిలోమీటర్ల పరిధిలో ప్రజలను ఖాళీ చేయిస్తోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు ఏ ప్రకటన వెలువడుతుందోనన్న ఉత్కంఠ వాతావరణం ఇరుదేశాల సరిహద్దుల్లో ఉంది. దీంతో లోక్సభ ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావారణం వేడెక్కుతున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ తో యుద్ద వాతావరణం నెలకొనడంతో దేశంలో రాజకీయ యుద్దంకు తాత్కాలికంగా తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యుద్దం వస్తే ఎన్నికలు జరగడం సందేహమే..! వాయిదా వేయనున్న ఈసీ..!!
యుద్దం వస్తే ఎన్నికలు జరగడం సందేహంగా మారనుంది. వాస్తవానికి మార్చి 4 నుంచి 7వ తేదీ మధ్య దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు వివిధ దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. మే 18వ తేదీతో ప్రస్తుత ప్రభుత్వం పదవీకాలం ముగస్తుంది. ఆలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. అలాగే లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచలప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది.
జమ్మూ అసెంబ్లీకి ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే..! పరిస్థితులు చల్లబడ్డాకే నిర్ణయం..!!
ఇదే సమయంలో జమ్మూ కశ్మీర్కు ఎన్నికలు జరుపుతామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితుల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరపడం దాదాపు అసాధ్యం. అదే సమయంలో భారత్, పాక్ మధ్య యుద్దం వస్తే లోక్సభ ఎన్నికలు వాయిదా పడతాయి. ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు ఎంతో అవసరం ఉంటుంది. రాష్ట్రాల్లో ఉన్న పోలీసులతో ఎన్నికలు జరపడం అసాధ్యం. ఇదే సమయంలో యుద్దం మొదలైతే ఎప్పటికీ ముగుస్తుందో తెలియదు. నెల రోజులు కొనసాగవచ్చు లేదా రెండు నెలలు కొనసాగవచ్చు.
మార్చి నాలుగు తర్వా త షెడ్యూల్..!? కసరత్తు చేస్తున్న ఈసీ..!!
సరిహద్దుల్లో యుద్దం జరుగుతుంటే రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు ఏ మాత్రం ఒప్పుకోవు. భద్రత దృష్ట్యా కూడా ఇది మంచి పరిణామం కాదు. అందుకే యుద్దం ప్రకటన వస్తే లోక్సభ ఎన్నికలు వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మార్చి నాలుగు తర్వా త షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నప్పటికీ ఈ లోపు యుద్దం ప్రకటన వస్తే షెడ్యూల్ను వాయిదా వేసే అవకాశం ఉంది.
రణమా..? శరణమా..? తేలేది మరికొద్ది గంటల్లోనే..!!
మరో 72 గంటలు కీలకమని పాకిస్థాన్ రక్షణమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఏ విషయం తేలిపోనుంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా చెప్పారు. ఆయన ప్రకటన కేవలం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చేసినదే కావడం విశేషం. యుద్దం వస్తే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తే ఆ మేరకు ఎన్నికల సంఘం కూడా వాయిదా వేయకతప్పదు.