అంగ ప్రవేశం జరగనంత మాత్రాన... బాలికపై పెంపుడు తండ్రి అత్యాచార కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు...
మైనర్ బాలికపై అత్యాచార కేసులో ముంబై హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం అంగ ప్రవేశం జరగనంత మాత్రాన దాన్ని అత్యాచారంగా పరిగణించకుండా ఉండలేమని పేర్కొంది. నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు... అతనికి పోక్సో కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సమర్థించింది. 74 ఏళ్ల ఓ వృద్దుడు తన దత్తత కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి ముంబై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
కేసు వివరాల్లోకి వెళ్తే... ఔరంగాబాద్ జిల్లాలోని పైతాన్ గ్రామానికి చెందిన దంపతులు ఓ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. డిసెంబర్ 16,2016న ఆ బాలిక తల్లి పక్క ఊరిలో బంధువుల పెళ్లికి వెళ్లింది. బాలిక,ఆమె తండ్రి మాత్రమే ఆరోజు ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన 74 ఏళ్ల ఆ వృద్దుడు రాత్రి పూట తన దత్తత కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
అతని దుస్తులు పూర్తిగా విప్పేసి... ఆమెను కూడా బలవంతంగా దుస్తులు విప్పించాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి యత్నిస్తూ అంగ ప్రవేశం చేయబోయాడు. కానీ సాధ్య పడలేదు. అయినప్పటికీ బాలిక పట్ల లైంగిక దాడిని కొనసాగించాడు. కొద్దిరోజులకు ఆ బాలిక తన టీచర్లతో ఈ విషయం చెప్పడంతో... వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై అత్యాచార కేసు నమోదు చేశారు. ఆ ఘటన జరిగే నాటికి బాలిక వయసు 14 సంవత్సరాలు.
ఈ నేపథ్యంలో జులై 10,2019న పోక్సో కోర్టు అతన్ని దోషిగా తేల్చి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును అతను ముంబై హైకోర్టులో సవాల్ చేశాడు. ఓ ఆస్తి వివాదంలో తన భార్య సోదరులు తనను ఇరికించాలన్న ఉద్దేశంతో బాలికను ఒక పావుగా వాడుకుంటున్నారని తన పిటిషన్లో ఆరోపించాడు. అంతేకాదు,ఆ ఘటనలో అసలు అత్యాచారం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని... అసలు అంగ ప్రవేశం జరగలేదని పేర్కొన్నాడు.
తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఎంజీ సేవ్లికర్ ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాలను తోసిపుచ్చారు. నిందితుడి దుస్తులతో పాటు బాధితురాలి దుస్తులపై కూడా వీర్యపు మరకలు ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. బాధితురాలి జననాంగంలో అంగ ప్రవేశం చేసేందుకు యత్నించడం కూడా ఐపీసీ సెక్షన్ 375,376 కింద అత్యాచారం కిందకే వస్తుందన్నారు. కాబట్టి అంగ ప్రవేశం జరగనంత మాత్రాన అత్యాచారం జరగలేదని చెప్పేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.