వికాస్ దూబే పోతే మరో పదిమంది వస్తారు .. వాళ్ళ మాటేంటి ? ప్రశ్నించిన డీఎస్పీ కుటుంబం
కరడుగట్టిన గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే . వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఆయా కుటుంబాలు వికాస్ దూబే హతం పట్ల హర్షం వ్యక్తం చేశారు .మాకు పండగ రోజు అంటూ వ్యాఖ్యానించారు. తమ వారిని అత్యంత దారుణంగా హతమార్చిన గ్యాంగ్ స్టర్ మరణంపై స్పందించిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా కుటుంబ సభ్యులు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డీఎస్పీ దేవేంద్ర మిశ్రా వికాస్ దూబే చేతిలో హతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవేంద్ర మిశ్రా బంధువులు వికాస్ దూబేను చంపేశారు కానీ అతనికి సహాయం చేసిన వారి సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడుగుతున్నారు. వికాస్ దూబే స్థానంలో ఇప్పుడు మరో పదిమంది వస్తే వారి పరిస్థితి ఏంటి ? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ఆసక్తికర ప్రశ్నలు వేశారు దేవేంద్ర మిశ్రా కుటుంబ సభ్యులు. దేవేంద్ర మిశ్రాను హతమార్చినందుకు,హంతకుడుకి శిక్ష పడింది. అతను సజీవంగా లేడు. అయినా అతనికి సహాయం చేసిన వారంతా బాగానే ఉన్నారు కదా? వారి మాటేంటి అని ప్రశ్నించారు.
మన సమాజంలో ఒక జబ్బు ఉందని, ఆ జబ్బు ఎప్పటికీ అలానే ఉంటుందని ఒకరు కాకపోతే మరొకరు వస్తారని, దీనికి ముగింపు ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు దేవేంద్ర మిశ్రా కుటుంబ సభ్యులు . అంతేకాదు అతనికి సహాయం చేసిన రాజకీయ నాయకులు మాటేంటి? అతడి సహాయం తీసుకున్న పొలిటీషియన్స్ మాటేంటి? వికాస్ దూబే లాంటి ఒక నేరస్తుడు పోలీస్ స్టేషన్ లోనే ఒకరిని చంపి బయటకు వెళ్ళగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు ? అని వారు ప్రశ్నించారు.
దీనికి సంబంధించి మూలాల వరకు వెళ్లి పరిశీలించాలని, దూబే బతికి ఉంటే వైట్ కాలర్ నేరస్తుల గురించి అయినా తెలిసేది అని, వికాస్ దూబే కేసుకు సరైన ముగింపు కాదు అని వార ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అంటూ పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ వికాస్ దూబేను ఈరోజు కాన్పూర్ తరలిస్తున్న ఈ క్రమంలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం రోడ్డుమీద బోల్తా పడింది అని, ఈ క్రమంలో వికాస్ దూబే పోలీసుల మీద కాల్పులు జరిపితే చేశాడని, ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారని పేర్కొన్నారు. కానీ వికాస్ దూబే ఎన్కౌంటర్ జరుగుతుందనే పిల్ నిన్ననే హైకోర్టులో వేయడం కొసమెరుపు.