చైనాతో జరిపినట్లు పాకిస్తాన్తోనూ చర్చలు జరపాలి.... లోక్సభలో ఫరూఖ్ అబ్దుల్లా ప్రతిపాదన...
సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి చైనాతో చర్చలు జరుపుతున్న భారత్... అదే తరహాలో దాయాది పాకిస్తాన్తోనూ చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని శ్రీనగర్ ఎంపీ,జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. శనివారం(సెప్టెంబర్ 17) లోక్సభలో మాట్లాడిన అబ్దుల్లా... 'సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం ఉపసంహరణ కోసం భారత్ చైనాతో చర్చలు జరపాలని భావిస్తోంది. అదే తరహాలో పాకిస్తాన్తోనూ చర్చలు జరిపి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి.' అని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిర్బంధంలో ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా... విడుదల తర్వాత పార్లమెంటులో మాట్లాడటం ఇదే తొలిసారి. 'సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి... జవాన్లు చనిపోతున్నారు.. సమస్య పరిష్కారానికి ఓ మార్గాన్ని వెతకాలి. లదాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని చైనాతో ఎలాగైతే చర్చలు జరుపుతున్నారో... అదే విధంగా పాకిస్తాన్తోనూ చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలి.' అని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.
ఉగ్రవాదుల పేరుతో షోఫియన్లో ముగ్గురు సాధారణ పౌరులను ఎన్కౌంటర్ చేయడంపై ఆర్మీ విచారణకు ఆదేశించడంపై అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురికి ప్రభుత్వం తగిన పరిహారం అందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాను నిర్బంధంలో ఉన్నప్పుడు తన కోసం మాట్లాడిన పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జమ్మూకశ్మీర్లో 4జీ సేవలను నిలిపివేయడం విద్యార్థులు,వ్యాపారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని అన్నారు.
కాగా,జమ్మూకశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దును గత ఏడాది అగస్టులో కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక... అక్కడి పలువురు నేతలు నిర్బంధాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అందులో ఫరూఖ్ అబ్దుల్లా కూడా ఒకరు. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధం నుంచి విడుదల చేసింది.