ముందు నుయ్యి..వెనక గొయ్యిలా యడ్యూరప్పపరిస్థితి: లెక్కల చిక్కులు చెబుతోందేమిటి..?
బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. మంగళవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో కుమారస్వామికి మెజార్టీ దక్కకపోవడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే రాజీనామా లేఖను గవర్నర్కు ఇచ్చారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కుమారస్వామి కొనసాగనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని యడ్యూరప్ప గవర్నర్ను కోరారు. అయితే యడ్యూరప్ప పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఆయన పరిస్థితి కూడా ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది.... ఇంతకీ యడ్యూరప్పకు వచ్చిన ముప్పు ఏమిటి..?
సోషల్ మీడియాను హిలాయించేస్తోన్న 23
నెంబర్ గేమ్ పైనే యడ్యూరప్ప భవితవ్యం
అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు కుమారస్వామి ప్రభుత్వానికి కర్నాటకలో తెరపడింది. ఇప్పుడు చర్చంతా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా అనేదానిపైనే ఉంది. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోయిన కుమారస్వామి సర్కార్... తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోలేకపోయింది. దీంతో గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్ను కోరారు. అయితే కర్నాటక అసెంబ్లీలో బీజేపీకి 105 స్థానాలు ఉన్నాయి. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలంటే ఆయనకు అంకెలు సహకరించాల్సి ఉంది.
లెక్కలు ఏం చెబుతున్నాయి..?
ప్రస్తుతం 16 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. నిన్న బలపరీక్ష సమయంలో వారు సభకు గైర్హాజరయ్యారు. ఇంకా రాజీనామాలు ఆమోదం పొందలేదు కాబట్టి వారు ఇంకా ఎమ్మెల్యేల కిందే గుర్తింపు పొందుతారు. యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే రెబెల్ ఎమ్మెల్యేల మద్దతు తప్పని సరి అవుతుంది. ఒకవేళ రెబెల్ ఎమ్మెల్యేలు సభకు హాజరై యడ్యూరప్పకు మద్దుతు తెలిపితే వారిపై స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. దీంతో వారు ఎమ్మెల్యే గుర్తింపును కోల్పోతారు. ఆ సమయంలో మళ్లీ యడ్యూరప్ప పరిస్థితి మొదటికే వస్తుంది. అంటే తనకు కావాల్సిన మెజార్టీ కోల్పోతారు. ఒకవేళ సభకు మళ్లీ గైర్హాజరైతే యడ్యూరప్పకు 105 మంది సభ్యుల మద్దతు ఉంటుంది. 225లో 16 మంది సభ్యులను తీసివేస్తే 209 మంది సభ్యులు మాత్రమే ఉంటారు. అంటే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 105. బీజేపీకి ఇప్పటికే ఆ సంఖ్య ఉంది కాబట్టి యడ్యూరప్ప సీఎం అయ్యేందుకు లైన్ క్లియర్ అవుతుంది.
రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదించకపోతే...
105మంది సభ్యుల మెజార్టీతో యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయకుంటే వారు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. దీంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య మళ్లీ 225కు చేరుకుంటుంది. ఆ సమయంలో యడ్యూరప్ప ప్రభుత్వంకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113కు చేరుకుంటుంది. అది జరగని పరిస్థితుల్లో కర్నాటక రాష్ట్రం మళ్లీ ఉపఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యేలు సభకు హాజరై యడ్యూరప్పకు మద్దతు తెలిపితే ప్రజలముందు బీజేపీ దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఇక ఇతర స్వతంత్ర అభ్యర్థులు నిన్న జరిగిన బలపరీక్ష సమయంలో బీజేపీకి మద్దతు తెలపలేదు. రెబెల్ ఎమ్మెల్యేలు సభకు హాజరై యడ్యూరప్పకు మద్దుతు తెలిపితే స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయడం జరుగుతుంది.
బీజేపీకి ఉన్న మరో ఆప్షన్ ఏంటి..?
ఇక బీజేపీకి ఉన్న మరో ఆప్షన్ జేడీఎస్తో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అయితే జేడీఎస్ను బీజేపీ ఒప్పించగలదా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పటికే సిద్ధరామయ్య తనను మోసం చేశాడనే ఫీలింగ్లో కుమారస్వామి ఉన్నట్లు సమాచారం. సిద్ధరామయ్య తీరుతో కుమారస్వామి మనస్సు నొచ్చుకుని ఉంటే బీజేపీకి మద్దతు తెలిపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా జరిగితే ఇటు జేడీఎస్ సేఫ్ గేమ్ ఆడినట్లు అవుతుంది అదేసమయంలో బీజేపీ గట్టెక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
క్లిష్ట సమయంలో కనిపించని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్స్
గతేడాది కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ - జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఢిల్లీలోని కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించింది. ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు తలొగ్గకుండా ఉండేందుకు వెంటనే చర్యలు తీసుకుంది. ఎలాగైనా సరే కాంగ్రెస్ జేడీఎస్ల ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ఆ బాధ్యత మొత్తం ట్రబుల్ షూటర్స్ అయిన గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, వీరప్పమొయిలీలను రంగంలోకి దింపింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలినప్పటికీ సో కాల్డ్ ట్రబుల్ షూటర్స్ ఎవరూ కర్నాటకంలోకి ఎంటర్ కాలేదు.
మొత్తానికి యడ్యూరప్ప భవితవ్యం నెంబర్ గేమ్పైనే ఆధారపడి ఉంది. ఇక 76 ఏళ్ల యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా అయ్యేందుకు ఇదే చివరి అవకాశంగా కనిపిస్తోంది. అయితే ఏ విధంగా ఆయన ఈ ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించగలరనేదానిపైనే యెడ్డీ పొలిటికల్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది.