నా తల్లికి ఓటు వేయలేదంటే.. పాకిస్తాన్కు ఓటు వేసినట్లే: వరుణ్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు
సుల్తాన్ పూర్ : వివాదాలకు కేరాఫ్గా మారారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. తన తల్లి మేనకాగాంధీ తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. సుల్తాన్పూర్ నుంచి పోటీచేస్తున్న మేనకాగాంధీ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్మాతా కోసం ప్రజలంతా ఓటు వేయాలని అన్నారు. తన తల్లి సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తోందని చెప్పిన వరుణ్... తన తల్లికి ఓటు వేస్తే భారత మాతకు ఓటు వేసినట్లే అని చెప్పారు. హిందుస్తాన్లో జీవిస్తున్నప్పుడు భారతమాతకు మాత్రమే ఓటువేయాలని అన్నారు. ఇక ఇతరులకు ఓటు వేస్తే అది పాకిస్తాన్కు ఓటువేసినట్లే అని చెప్పి వివాదాలకు తెరలేపారు.
తన తల్లిపై పోటీచేసేవారు ఒకప్పుడు తన బూట్లకు లేసులు కట్టేవారని కూడా వరుణ్ గాంధీ చెప్పారు. ఈ వ్యాఖ్యలు బీఎస్పీ నేతలైన చంద్ర భద్ర సింగ్,సోనుసింగ్, యష్ భద్రసింగ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు సోను సింగ్ వరుణ్గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆ సమయంలో సోనుసింగ్ సుల్తాన్ పూర్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎస్పీ బీఎస్పీల తరపున అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఇక అఖిలేష్ యాదవ్ కుటుంబంపై కూడా నిప్పులు చెరిగారు వరుణ్ గాంధీ. పది పదిహేనేళ్ల క్రితం వీరంతా పేడతో పిడకలు తయారుచేసుకునేవారని ఇప్పుడు కోట్లు విలువ చేసే కార్లలో తిరుగుతున్నారని విమర్శించారు. వారు అనుభవిస్తున్న డబ్బులు ప్రజలది కాదా అని ప్రశ్నించారు. వరుణ్ గాంధీ వ్యాఖ్యలతో సుల్తాన్పూర్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.