Jobs:ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే... స్మోకింగ్ మానేయాల్సిందే..! పొగరాయుళ్ల పాట్లు వర్ణనాతీతం
రాంచీ: పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అనేది గురుజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలోని గిరీశం డైలాగ్. పొగతాగడం హానికరం అని సిగరెట్ పెట్టపైనే రాసి ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండానే ప్యాకెట్లకు ప్యాకెట్లు సిగరెట్లను అలా ఊది పారేస్తుంటారు పొగరాయుళ్లు. ఇక పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా.. ఆ సమయం వరకు ఆ మజాను ఆస్వాదించేందుకు సిగరెట్ తాగుతారు మరికొందరు. ఇక సిగరెట్ రేట్లు ప్రతి ఏటా పెరుగుతున్నప్పటికీ కొనడం మానడం లేదు. ఎంతైనా సరే వెచ్చిస్తున్నారు. అయితే ఇలా లాభం లేదని భావించిన ఓ రాష్ట్ర ప్రభుత్వం.. సిగరెట్టును ఉద్యోగంతో ముడిపెట్టింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో చూద్దామా..!
సిగరెట్కు ఉద్యోగంకు ముడి
"సరదా సరదా సిగరెట్టు...ఇది దొరల్ తాగు భలే సిగరెట్టు" అంటూ ఓ పాత సినిమా పాట ఉందనేది అందరికీ తెలుసు. సరదా సంగతి అటుంచితే.. సిగరెట్ తాగడం వల్ల ఎన్ని ప్రమాదకరమైన జబ్బులు వస్తాయో అందరికీ తెలిసిందే. పొగాకును ఓ వైపు నిషేధించలేకపోతున్న ప్రభుత్వం మరోవైపు దీని ధరను పెంచుకుంటూ పోతోంది. దీంతో కొనేవారు తక్కువ అవుతారనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. కానీ పొగరాయుళ్లు మాత్రం ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు. ధరను ఎంత పెంచుకుంటారో పెంచుకోండి.. కొనడం మాత్రం తగ్గేది లేదంటూనే నానా జబ్బులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇవేమీ వర్కౌట్ కావడం లేదని గ్రహించిన జార్ఖండ్ ప్రభుత్వం యువతలో పొగతాగేవారి సంఖ్యను తగ్గించాలన్న ఉద్దేశంతో సిగరెట్కు ఉద్యోగంకు ముడిపెట్టింది.
2021 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమలు
ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వారు ధూమపానానికి దూరంగా ఉండాల్సిందేనంటూ నిబంధన తీసుకొచ్చింది. అంతేకాదు పొగతాగడం లేదని ఒక అఫిడవిట్ కూడా సమర్పించాలని సూచించింది. త్వరలోనే దీన్ని అమలు చేస్తామంటూ ప్రభుత్వం పేర్కొంది. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. జార్ఖండ్ చీఫ్ సెక్రటరీ సుఖ్దేవ్ నేతృత్వంలో పొగాకు నియంత్రణ సహకార కమిటీతో జరిగిన సమావేశంలో ఓ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సిగరెట్లు, ఇతర పొగాకు వస్తువులు అమ్మే దుకాణాల్లో టీ, బిస్కెట్ అమ్మకూడదని ఆ నిబంధన అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే పోగాకు నియంత్రణ చట్టం జార్ఖండ్లో అమలవుతుండగా... 150 మంది ట్రేడర్లు మాత్రమే పొగాకు ఉత్పత్తులు విక్రయించేందుకు అధికారికంగా లైసెన్సు కలిగి ఉన్నారు. ఇక ఈ దుకాణాదారులు టీ, బిస్కెట్లు కూడా అమ్ముతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నారు.
Recommended Video
జార్ఖండ్లో పొగాకు రహిత జిల్లాలు
త్వరలోనే జార్ఖండ్లోని రాంచీ, ధన్బాద్, బొకారో, కుంతి, సరైకేలా-ఖార్సవాన్, హజారీబాగ్ జిల్లాలు పొగాకు రహిత జిల్లాలుగా చరిత్ర సృష్టించబోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇక ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునేవారు తాము పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటామని చెబుతూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య, విద్య మరియు కుటుం సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఇక గుట్కాను కూడా నిషేధించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక పాఠశాలలు ఉన్న 100 మీటర్ల పరిధిలో పొగాకు వస్తువులు విక్రయించరాదని దీనిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే పొగాకుతో ఉద్యోగం ముడిపెడుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ తొలి రాష్ట్రం కాదు. అంతకుముందు రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వ ఉద్యోగులు నోస్మోకింగ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటూ 2014లో ఆదేశాలు జారీ చేసింది.