భారత్ లో ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందే .. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలనం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించవలసిందే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర కేంద్రంగా ఉన్న ఒక హిందీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన భారతదేశంలో ముస్లింలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా భారతదేశంలోనే అత్యధికంగా ముస్లింలు ఉన్నారని, వారంతా సంతోషంగా ఉన్నారని మోహన్ భగవత్ పేర్కొన్నారు. వారికి ఆ గౌరవాన్ని , స్థానాన్ని ఇండియా కల్పించిందని అన్నారు .
స్వదేశీ అంటే విదేశీ ఉత్పత్తులను బహిష్కరణ కాదు : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముస్లింలకు భారత్ లో స్థానం
భారత రాజ్యాంగం హిందువులు మాత్రమే ఉండాలని ఎక్కడా చెప్పలేదని, అయితే ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందే అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా ముస్లింలకు భారతదేశంలో స్థానం కల్పించామని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలపై దాడి జరిగిన ప్రతిసారి అన్ని మతాల వాళ్ళూ కలిసి పోరాటం సాగించారని,ఈ ఐక్యత ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని పేర్కొన్నారు. ఇది చాలా గొప్ప విషయం అంటూ చెప్పారు మోహన్ భగవత్.
పాకిస్తాన్ వంటి దేశాల్లో ఇతర మతాల వారికి ఎలాంటి హక్కులు లేవు
మొగల్ చక్రవర్తి అక్బర్ కు వ్యతిరేకంగా మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో చాలామంది ముస్లింలు ఉండి పోరాటం సాగించారని ఆయన గుర్తు చేశారు. అంతేకాదు భారత దేశంలో ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందే అంటూ పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం గా మారింది. ఒక్క భారతదేశంలో మాత్రమే ఇతర మతాల వారికి హక్కులు కల్పించామని, పాకిస్థాన్ వంటి దేశాలలో ఇతర మతాల వారికి ఎలాంటి హక్కులు లేవని, ఇండియాలో మాత్రం అన్ని మతాల వారు సంతోషంగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.
స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేసేవారే వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేది
తమ స్వార్థ ప్రయోజనాల కోసం మనుషుల మధ్య విఘాతం కలిగించే వారే వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. భారతదేశం హిందూ దేశం అని, హిందుత్వం దాని స్వభావమని పేర్కొన్నారు మోహన్ భగవత్. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి సైద్ధాంతిక గురువు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయోధ్యలో రామాలయం గురించి కూడా మాట్లాడారు. అయోధ్యలోని రామాలయం జాతీయ విలువలకు, దేశ స్వభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.
Recommended Video
రామాలయ నిర్మాణం హిందువుల ఆకాంక్షకు ప్రతీక
హిందూ దేశ ప్రజల విలువలను, ధైర్యాన్ని అణచివేయడానికి గతంలో మొఘలుల కాలంలో ఆలయాల విధ్వంసం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలను పునర్నిర్మించాలని హిందూ సమాజం చాలాకాలంగా కోరుకుంటోందని చెప్పిన మోహన్ భగవత్ అయోధ్యలో రామమందిర నిర్మాణం హిందువుల ఆకాంక్షకు ప్రతీక అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆయన ముస్లిం లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.