కేంద్రం హెచ్చరిక: ఫేక్ మెసేజ్ల కట్టడికి ‘వాట్సాప్’ కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా వేదిక వాట్సాప్ ఫేక్ న్యూస్ అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. తప్పుడు, హానికరమైన సందేశాల నుంచి యూజర్లను కాపాడేందుకు, ఫేక్ న్యూస్ నివారించేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.
వాట్సాప్ 2.18.204 బీటా వార్షన్లో కొత్త ఫీచర్ను వాట్సాప్ ప్రవేశపెట్టిందని గాడ్జెట్ నౌ తన కథనంలో పేర్కొంది. 'అనుమానిత లింక్'(సస్పియస్ లింక్ డిటెక్షన్) అనే ఫీచర్ ద్వారా గ్రూపుల్లో ఫార్వర్డ్ అయ్యే ఫేక్ న్యూస్పై యూజనర్లను హెచ్చరిస్తుందని తెలిపింది.
యూజర్లు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పుడు, వాట్సాప్లో వచ్చే ఆ వెబ్సైట్ లింక్ ప్రామాణికతను పరీక్షిస్తుందని పేర్కొంది. ఆటోమేటిక్గా మెసేజ్ ఫార్వర్డ్ అయిన అనుమానిత లింక్లను తనిఖీ చేసి, యూజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ ఫీచర్ తోపాటు ఫేక్ న్యూస్ విస్తరించకుండా ఉండేందుకు వాట్సాప్ ఇతర చర్యలను కూడా తీసుకున్నట్లు వెల్లడించింది.
షేర్ అయిన మెసేజ్ టైప్ చేసిందా? ఫార్వర్డ్ చేసిందా? అనే విషయాన్ని కూడా ఈ ఇన్స్టాంట్ మెసేంజర్ చెబుతుంది. ఆ మెసేజ్లను పంపించకుండా ఉండేందుకు గ్రూప్ అడ్మిన్లు యూజర్లపై వేటు కూడా వేయవచ్చు. కేవలం గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే మెసేజ్ లు పోస్టు చేసే అధికారం ఇప్పటికే అమల్లో ఉంది.
ఈ ఆప్షన్ సాయంతో తప్పుడు వార్తల వ్యాప్తిని నిరోధిస్తామని వాట్సాప్ పేర్కొంది. ఇటీవల వాట్సాప్లో చిన్న పిల్లల కిడ్నాప్లంటూ ప్రచారం జరిగిన ఫేక్ మెసేజ్ల కారణంగా 29మంది హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం వాట్సాప్ను తీవ్రంగా హెచ్చరించింది. ఫేక్ మెసేజ్లను కట్టడి చేయాలని ఆదేశించింది.