మహిళ ఐపీఎస్కు తప్పని లైంగిక వేధింపులు.. సీనియర్ టార్చర్తో కోర్టుకు... కేసు విచారణ తెలంగాణకు ....
చెన్నై/హైదరాబాద్ : ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అతివలకు ఇస్తామని ఊదరగొడుతుంటారు. సమాన హక్కులు అని, విద్య, ఉద్యోగాలు కల్పిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తారు. అయితే వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. మహిళలకు వేధింపులు తప్పడం లేదు. అదీ కూడా పని చేసే చోట లైంగికంగా వేధించడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని కూడా వేధింపుల పర్వం తప్పడం లేదు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఓ ఐపీఎస్ అధికారిని సీనియర్ లైంగికంగా వేధించడం కలకలం రేపుతుంది. దీంతో మహిళ ఏ స్థానంలో ఉన్న వేధింపులు మాత్రం తప్పడం లేదని అర్థమవుతుంది.
వేధింపుల పర్వం
తమిళనాడు క్యాడర్కు చెందిన ఓ ఐపీఎస్ మహిళా అధికారి తన విధులు సక్రమంగా నిర్వహిస్తోంది. ఇంతలో ఆమెకు తలపొగరు ఉన్న సీనియర్ అధికారి మురుగన్తో పనిచేయాల్సి వచ్చింది. పని చేయమంటే సరే .. కానీ అతడు ఓ మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించడం కలకలం రేపుతుంది. తమిళనాడు క్యాడర్కు చెందిన ఐజీ ర్యాంకు గల మురుగన్ .. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగానికి జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇంతలో మహిళా ఐపీఎస్ అధికారి అతని వద్ద పనిచేసేందుకు వచ్చారు.
తప్పని టార్చర్
దీంతో అతను ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అదీ ఇదీ అని చివరకు లైంగికంగా టార్చర్ పెట్టాడు. దీంతో ఆమె గతేడాది ఆగస్టులో అంతర్గత కమిటీ దృష్టికి తన సమస్యను తీసుకొచ్చారు. పనిచేసే చోట లైంగిక వేధింపుల గురించి 2013 చట్టం కింద ఫిర్యాదు చేశారు. తర్వాత హైకోర్టులో మురుగన్పై ఫిర్యాదు చేశారు. ఈ కేసును హైకోర్టు ధర్మాసనం విచారించింది. మురుగన్పై సీబీ సీఐడీ గతేడాది సెప్టెంబర్లో 341, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి ఆర్థిక నేరాల నిబంధన కింద కూడా కేసు కట్టారు.
ఫిర్యాదు
అయితే కేసు విచారణ క్రమంపై మహిళా ఐపీఎస్ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసు తమిళనాడులో విచారిస్తే .. అధికారులను మురుగున్ ప్రభావితం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆమె వాదనలతో ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు ... కేసు విచారణ బాధ్యతలను బుధవారం తెలంగాణ ప్రభుత్వానికి జస్టిస్ సుబ్రమణియన్ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీచేశారు మహిళా ఐపీఎస్ వేధింపుల కేసు విచారించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి స్పష్టంచేశారు. కేసు విచారణ చేపట్టి 6 నెలల్లో ఎంక్వైరీ పూర్తి చేయాలని కండీషన్ విధించారు..