IGNOU Admissions:జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ కోర్సుకు ఇగ్నో నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఓపెన్ యూనివర్శిటీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో)లో స్కూల్ ఆఫ్ జర్నలిజం మరియు న్యూ మీడియా స్టడీస్ కొత్త అకడెమిక్ ప్రోగ్రాంకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎంఏ (జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్) కోర్సును దూరవిద్య (డిస్టెన్స్ లెర్నింగ్) ద్వారా అందిస్తోంది. ఎంఏ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ కోర్సు కనీస వ్యవధి రెండేళ్లు కాగా గరిష్ట వ్యవధి ఐదేళ్లు. అంటే ఐదేళ్లకు మించి ఈ కోర్సును చేయరాదు. ఈ కోర్సు చేసేందుకు ఎలాంటి ఏజ్లిమిట్ లేదని ఇగ్రో తన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ కోర్సు చదవాలంటే అభ్యర్థికి ఉండాల్సిన విద్యార్హతలు ఇలా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ. కంప్యూటర్ ఇంటర్నెట్ మరియు వర్డ్ ప్రాసెసింగ్పై కనీస అవగాహన కలిగి ఉండాలని ఇగ్నో తన ప్రకటనలో వెల్లడించింది. ఇక కోర్సు ఫీజు చూస్తే... రెండు సంవత్సరాలకు కలిపి కోర్సు ఫీజు రూ.25వేలు అవుతుంది. కొత్తగా ప్రారంభమైన ఈ కోర్సు ముందుగా ఇంగ్లీషు మీడియంలోనే అందించడం జరుగుతుందని ఇగ్నో పేర్కొంది. అయితే మెటీరియల్ను హిందీలోకి తర్జుమా చేసి అందివ్వడం జరుగుతుందని ఇగ్నో పేర్కొంది. అయితే కోర్సు బోధన హిందీ మీడియంలో అందించేందుకు మరికొంత సమయం పడుతుందని ఇగ్నో స్పష్టం చేసింది.
ఇగ్నోలో ఎంఏ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ కోర్సుకు ఇలా అప్లయ్ చేసుకోవాలి
* ఇగ్నో అధికారిక వెబ్సైట్కు లాగిన్ అవ్వండి(http://www.ignou.ac.in)
* హోంపేజ్పై ఆన్లైన్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ జనవరి 2020 సెషన్ అనే లింక్ పై క్లిక్ చేయండి
* క్లిక్ చేసిన వెంటనే మరో వెబ్పేజ్ ఓపెన్ అవుతుంది
* మీ పేరును నమోదు చేసుకోండి. ఒకవేళ అప్పటికే రిజిస్టర్ అయి ఉంటే మీ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేయండి
* అక్కడ పొందుపర్చిన అప్లికేషన్ను పూర్తి చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి
* సబ్మిట్ చేసిన అప్లికేషన్ను భవిష్యత్తు రిఫరెన్స్ కోసరం ప్రింట్ తీసుకుని పెట్టుకోండి
ఒకవేళ ఏడాది తర్వాత కోర్సులో కొనసాగలేనని అభ్యర్థి భావిస్తే లేటరల్ ఎగ్జిట్ను ఎంచుకోవచ్చు. అలాంటి వారికి జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా అందించడం జరుగుతుంది.