ఐఐఎం బెంగళూరు విద్యార్ధుల వినూత్న నిరసన: చెప్పులతో గేటు ముందు: సీఏఏకు వ్యతిరేకంగా..!
పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలు కర్నాటకలో తీవ్ర స్థాయికి చేరాయి. బెంగుళూరులోని ఐఐఎం విద్యార్ధులు సైతం నిరససల్లో పాల్గొంటున్నారు. క్యాంపస్ లో నిరసనలకు అనుమతి నిరాకరించటం తో వారు వినూత్న పద్దతిలో నిరసన కొనసాగించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్మెంట్, బెంగుళూరు విద్యార్ధులు నిరసనలు చేయటానికి అనుమతి లేదంటూ డీన్..నిర్వాహకులు విద్యార్ధులకు గురువారం ఉదయం మెయిల్ ద్వారా స్పస్టం చేసారు.
సెక్షన్ 144 విధింపు కారణంగా..పెద్ద సంఖ్యలో విద్యార్ధులు ఒక్క చోట చేరటానికి అనుమతి లేదని..క్యాంపస్ లోపల నిరసనలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అదే విధంగా క్యాంపస్ పరిసరాల్లో నిరసనలు అనుమతించేది లేదని స్పష్టం చేసారు.
విద్యార్ది సంఘాల నిరసనలకు పిలుపునివ్వటం కారణంగా బెంగుళూరు పోలీసు కమిషనర్ భాస్కర రావు గురువారం ఉదయం 6 గంటల నుండి శనివారం అర్ద్రరాత్రి వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అయినా, గురువారం రాత్రి 7 గంటలకు విద్యార్ధులు నిరసన ప్రారంభించారు. దాదాపు వంద మందికి పైగా విద్యార్ధులు ఆందోళనలో పాల్గొన్నారు.
వారు ఆందోళన చేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద విద్యార్దులు వందల సంఖ్యలో పాదరక్షల జతలను వందల సంఖ్యలో ఉంచి..తమ నిరసన వ్యక్తం చేసారు. వారు సీఏఏకు వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగిస్తున్నారు. అనేక మంది విద్యార్ధులు క్యాంపస్ ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. ఒక వ్యక్తి వీల్ ఛైర్ లో సైతం వచ్చి నిరసనలో పాల్గొన్నారు.
ఉదయమే నిరసన నిర్వహించాలని భావించినా..నిషేధం ఉండటంతో వాయిదా వేసుకున్నారు. మధ్నాహ్ననికి విద్యార్దులు ఉత్తర్వులు అతిక్రమించకుండా..ఇతర విద్యార్ది సంఘాలకు మద్దతుగా వ్యవహరించాలని నిర్ణయించారు. అయితే, చివరకు భిన్నాభిప్రాలు ఉన్నప్పటికీ ఐఐఎం వద్ద ఈ విధంగా వినూత్నంగా విద్యార్ధులు నిరసన వ్యక్తం చేసారు. క్యాంపస్ బయట చెప్పులు..ప్లకార్డులు ప్రదర్శించి సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నారు.