వర్సిటీ ర్యాంకింగ్స్: బెంగళూరు ఐఐఎస్సీ టాప్, జాబితాలో ఏపీ, టీ వర్సిటీలు
లండన్: ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ యూనివర్శిటీల్లో భారత్కు చెందిన 49 వర్శిటీలకు చోటు దక్కింది. భారత్ ర్యాంకులను పరిశీలిస్తే ఎప్పటిలాగే వీటిలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఐఐటీ ఇండోర్, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ, జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర యూనివర్శిటీలు భారత్ నుంచి టాప్ 5లో నిలిచాయి.
ఈ జాబితాలో 251వ ర్యాంక్తో ఐఐఎస్సీ బెంగళూరు భారత యూనివర్శిటీల్లో టాప్లో ఉంది. ఆసియా వర్శిటీల పరంగా చూస్తే ఐఐఎస్సీ 29వ స్థానంలో నిలిచింది. తొలిసారిగా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఐఐటీ ఇండోర్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 400లో ఉంది. ఇక గతేడాది టాప్ 351-400 ర్యాంకింగ్ బ్యాండ్లో ఉన్న ఐఐటీ బాంబే ఈ సంవత్సరం 401-500 బ్యాండ్కు పడిపోయింది.
ఐఐటీ ఇండోర్తో పాటు ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ పుణె, కోల్కతా, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ, కర్ణాటకలోని శ్రీ శివరాత్రీశ్వర యూనివర్శిటీ ఈ ఏడాది ర్యాంకింగ్ జాబితాలో చోటు సాధించాయి.
కాగా, 2018 సంవత్సరానికి గానూ 'టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్' విడుదలయ్యాయి. ఈ జాబితాలో వరుసగా మూడో ఏడాది ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ 2, స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ మూడో స్థానం దక్కించుకున్నాయి. మొత్తంగా 1200లకు పైగా యూనివర్శిటీలతో జాబితా రూపొందించగా.. భారత్ నుంచి 49 విశ్వ విద్యాలయాలు చోటు సాధించాయి.