విదేశీ వర్శిటీలకు తలుపులు తెరిచే ఉంచాం: పరిశోధనలు జీవితంలో భాగం: మోడీ
న్యూఢిల్లీ: దేశంలో పరిశోధకుల కొరత ఉందని, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పరిశోదనలను తమ జీవితంలో ఓ భాగంగా అలవర్చుకోవాలని ఆయన సూచించారు. పరిశోధనలను ఒక అలవాటుగా మార్చుకోవాలని, భవిష్యత్తు పునాదులు దాని మీదే ఆధాపడి ఉన్నాయని చెప్పారు. ఒకేసారి 300 మంది పీహెచ్డీ విద్యార్థులు పట్టాలను అందుకోవడం గర్వంగా ఉందని మోడీ వ్యాఖ్యానించారు. విజ్ఙానానికి హద్దులు లేవని, దాన్ని సముపార్జించుకోవడానికి నిరంతర ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన అకాంక్షించారు.
ఐఐటీ-గువాహటి కన్వొకేషన్లో..
అస్సాంలోని ఐఐటీ-గువాహటి 22వ కన్వొకేషన్ను ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యువత కన్న కలలకు అనుగుణంగా భారత్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు. అనేక అవకాశాలు భారతీయ యువత తలుపు తడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) రంగాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కరోనా వైరస్ పరిస్థితులు గుర్తు చేశాయని చెప్పారు.
పరిశోధనల అవసరాన్ని గుర్తు చేసిన కరోనా..
కరోనా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడానికి ఐఐటీల నుంచి అనేక పరికరాలు అందాయని, ఆత్మనిర్భర్ భారత్కు ఇది నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలను కేంద్రబిందువుగా చేసుకుని పరిశోధనలు కొనసాగించేలా చర్యలు చేపడుతామని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలను పరిశోధనల హబ్గా తీర్చిదిద్దుతామని ప్రధాని చెప్పారు. ఐఐటీ-గువాహటిలో సెంటర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ, రిస్క్ మేనేజ్మెంట్ను అభివృద్ధి చేయాలని మోడీ ఈ సందర్భంగా వారికి సూచించారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి యాక్ట్-ఈస్ట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. పరిశోధనల కోసం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తున్నామని చెప్పారు.
ఫిట్ ఇండియా మూవ్మెంట్..
గురువారం దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే దేశం ఆరోగ్యంగా ఉంటుందని, దీనికోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు.
టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి టాప్ మోడల్ మిలింద్ సోమన్, రజుతా దివాకర్ వంటి క్రీడాకారులు, అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు.
Recommended Video
విదేశీ వర్శిటీలకు సాదర ఆహ్వానం..
దేశంలో విద్యాప్రమాణాలను మరింత మెరుగుపర్చడానికి సరికొత్త విద్యావిధానాన్ని అమలు చేయబోతున్నామని మోడీ తెలిపారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దబోతున్నామని, ఈ నూతన విద్యా విధానం ద్వారా సంపూర్ణ మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు రాబోతున్నాయని నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టామని, వాటి కోసం తలుపులు తెరిచే ఉంచామనీ అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలకు చెందిన క్యాంపస్లను దేశంలో నెలకొల్పాలనుకునే వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నామని మోడీ పేర్కొన్నారు.