కార్పూర్ ఐఐటీలో సంచలనం: 22మంది విద్యార్థులపై వేటు
కాన్పూర్: ర్యాగింగ్కు పాల్పడుతున్న విద్యార్థులపై ఐఐటీ కాన్పూర్ సంచలన నిర్ణయం తీసుకుంది. జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడినందుకు 16మంది సీనియర్ విద్యార్థులను మూడేళ్ల పాటు, మరో ఆరుగురిని ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కాగా, ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మూడో ఏడాది విద్యార్థులు తమ కింది తరగతి విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడిన దృశ్యాలు సోషల్మీడియాలో హల్చల్ చేయడం యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన ఐఐటీ-కె సెనేట్, అపెక్స్ నిర్ణయ కమిటీ సోమవారం సమావేశమై దీనిపై విచారణ చేపట్టాయని ఐఐటీ కాన్పూర్కు చెందిన అధికారి ఒకరు మంగళవారం మీడియాకు తెలిపారు.
ర్యాగింగ్ను తీవ్రంగా పరిగణించడంతో 16 మంది విద్యార్థులను మూడేళ్ల పాటు సస్పెండ్ చేసినట్లు ఐఐటీ-కె డైరెక్టర్ డాక్టర్ మణీంద్ర తెలిపారు. ఈ నిర్ణయంపై సీనియర్ విద్యార్థులు క్షమాభిక్ష కోరకపోవడం గమనార్హం. అయితే సస్పెన్షన్ ముగిసిన అనంతరం తమను తిరిగి అనుమతించాలని కోరారు. ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో విద్యార్థి జింఖానా అధ్యక్షుడు, ఆఫీస్ బేరర్లను పదవుల నుంచి తొలగించారు.
50 మంది సీనియర్లు తమను ర్యాగింగ్ చేస్తున్నారని, బూతులు తిట్టడంతో పాటు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని 30 మంది జూనియర్లు ఆగస్టు 20న యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ర్యాగింగ్ నిరోధక విభాగం ఈ వ్యవహారంలో 24 మంది సీనియర్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. వారిని కఠినంగా శిక్షించాలని, కోర్సు నుంచి తొలగించాలని, పోలీసు కేసు నమోదు చేయించాలని సిఫార్సు చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే తీవ్ర చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్యం తెలిపింది.