ఐఐటీ మద్రాసు: లేడీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు, ప్రాజెక్ట్ అధికారి అరెస్ట్
చెన్నై: ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాసు ప్రాజెక్ట్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళా పీహెచ్డీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు తీసే ప్రయత్నం చేస్తూ పట్టుబడటంతో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ విద్యార్థి బుధవారం వాష్ రూమ్లో స్నానం చేస్తుండగా.. గోడకు చిన్న రంధ్రం ఉన్నట్లు గుర్తించింది. ఆ రంధ్రం గుండా ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభమ్ బెనర్జీ వీడియో తీస్తున్నట్లు గమనించింది. ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఐఐటీ మద్రాసు సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే, నిందితుడు ఫోన్లో సంబంధిత ఎలాంటి వీడియోలు దొరకలేదని పోలీసులు తెలిపారు. ఆ మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించామని, విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.