ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని సూసైడ్: బరిలో దిగిన సీబీఐ: బడాబాబుల హస్తం ఉందంటూ..!
చెన్నై: రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐఐటీ-మద్రాస్ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసులో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. సీబీఐ అధికారులు సోమవారం తమ విచారణను ప్రారంభించారు. ఐఐటీ-మద్రాస్ అధికారులను కలిశారు. వారి నుంచి కొన్ని వివరాలను సేకరించారు. ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ గదిని నేడో, రేపో పరిశీలిస్తారని తెలుస్తోంది. ఫాతిమా లతీఫ్ స్నేహితులు, ప్రొఫెసర్లను ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు.
కేరళలోని కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్ ఐఐటీ మద్రాస్ విద్యార్థిని. హ్యుమానిటీ సైన్సైస్ లో ఆమె మొదటి సంవత్సరం చదువుతున్నారు. కిందటి నెల 9వ తేదీన ఆమె హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ అనుమానించారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ సైతం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.
ఫాతిమా లతీఫ్ ఫోన్ లో సూసైడ్ నోట్ కనిపించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఫాతిమా సోదరి ఆయేషా ఆమె ఫోన్ను పరిశీలించగా.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రొఫెసర్లు సుదర్శన్ పద్మనాభన్ హేమచంద్రన్, మిలింద్ బ్రహ్మే వేధింపులే కారణమని అందులో రాసి ఉంది. ఈ సూసైడ్ నోట్ ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసును మలుపు తిప్పింది. మొదట్లో- చెన్నై పోలీసు కమిషనర్ రంగంలోకి దిగి ఆ కోణంలో దర్యాప్తు చేశారు.
ఫ్రెండ్ రూమ్ లో.. క్లాస్ మేట్స్ తో: అబ్బాయిలతో మందు కొట్టిన విద్యార్థినులు: కాలేజీ నుంచి తొలగింపు..
పోలీసుల దర్యాప్తుపై ఫాతిమా లతీఫ్ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగించట్లేదంటూ ఆరోపణలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసి, తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనితో పినరయి విజయన్.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి అధికారికంగా లేఖ రాశారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనితో తమిళనాడు ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీబీఐకి బదలాయించింది. ఈ మేరకు పదిరోజుల కిందటే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో.. ఇక సీబీఐ రంగంలోకి దిగింది. ఈ ఉదయం వారు తమ దర్యాప్తును ఆరంభించారు. ఇందులో భాగంగా ఐఐటీ-మద్రాస్ అధికారులను సంప్రదించారు. సూసైడ్ నోట్ లో పొందుపరిచిన ప్రొఫెసర్లు, కొందరు విద్యార్థులను కూడా వారు విచారించనున్నట్లు తెలుస్తోంది.