విద్యార్థినిపై ఐఐటి మద్రాసు ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
తనను నమ్మి వచ్చిన విద్యార్థినిపై మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ బి రామమూర్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిజ నిర్ధారణ కమిటీ తేల్చిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వివరాల్లోకి వెళ్లితే.. సెప్టెంబర్ నెలలో పోలాండ్లో జరిగిన సైన్స్ కాన్ఫరెన్స్కు ఆ విద్యార్థిని ప్రొఫెసర్ తోపాటు వెళ్లింది. కాగా అక్కడ హోటల్లోని తన గదిలోనే పడుకోవాలని ప్రొఫెసర్ ఒత్తిడి చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విద్యార్థిని ఆరోపించింది. దీంతో ఆ హోటల్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు బాధితురాలు పేర్కొంది.
ప్రొఫెసర్ మాత్రం విద్యార్థిని భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆమె దగ్గర ఎక్కువ డబ్బు లేదనే ఉద్దేశంతోనే తన గదిలో ఉండాలని కోరినట్లు కమిటీకి తెలిపారు. అయితే విద్యార్థిని గది నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె భద్రత గురించి గానీ, ఎక్కడ ఉందని గానీ ప్రొఫెసర్ పట్టించుకోలేదని నిజ నిర్ధారణ కమిటీ తన విచారణలో తేల్చింది. కాగా బాధితురాలు జరిగిన సంఘటనతో తీవ్ర అసంతృప్తికి లోనైందని, ఆమె ఆరోగ్యం కూడా స్వల్పంగా క్షీణించిందని నిజ నిర్ధారణ కమిటీకి ఆ విద్యార్థిని స్నేహితులు తెలిపారు.
నిజ నిర్ధారణ కమిటీ సూచనల మేరకు ఐఐటి మద్రాసు గవర్నింగ్ బాడీ నిందిత ప్రొఫెసర్ను సస్పెండ్ చేసేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా వేధింపుల విషయాన్నిగానీ, సస్పెన్షన్ విషయాన్ని గాన్నీ కళాశాల యాజమాన్యం మీడియాకు తెలిపేందుకు ఇష్టపడటం లేదు. వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అలాంటిది ఏదైనా జరిగితే కారకులపై తగిన చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యం తెలిపింది.