Covid Third Wave: అక్టోబర్లో కరోనా థర్డ్ వేవ్ పీక్స్కి..? రోజుకు ఎన్ని కేసులు నమోదవుతాయంటే...
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిందో లేదో థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇప్పటికీ పూర్తిగా సమసిపోలేదన్న వాదన కూడా ఉంది. కొద్దిరోజులుగా కోవిడ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదవుతుండటంతో మళ్లీ ఆందోళన మొదలవుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్లో దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలువురు నిపుణులు అంచనా వేశారు. తాజా పరిశోధనల్లో థర్డ్ వేవ్ అంతకన్నా ముందే వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.
అగస్టులో మొదలై అక్టోబర్లో పీక్స్కి...
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ అగస్టులో మొదలై అక్టోబర్ నాటికి పీక్స్ చేరుకునే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్,కాన్పూర్ ఐఐటీలకు చెందిన మత్తుకుమళ్లి విద్యాసాగర్,మనీంద్ర కుమార్ నేత్రుత్వంలోని బృందం చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అక్టోబర్లో ఎంత లేదన్న దేశవ్యాప్తంగా రోజుకు 1లక్ష కేసులు నమోదవవచ్చునని... ఒకవేళ పరిస్థితి మరింత దారుణంగా ఉంటే రోజుకు 1,50,000 కేసులు నమోదవచ్చునని ఆ బృందం అంచనా వేస్తోంది. అదే సమయంలో సెకండ్ వేవ్తో పోలిస్తే థర్డ్ వేవ్ అంత భయానకంగా ఉండకపోవచ్చునని చెబుతోంది. సెకండ్ వేవ్లో రోజుకు గరిష్ఠంగా 4లక్షల పైచిలుకు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
థర్డ్ వేవ్లోనూ ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు...
మ్యాథమెటికల్ మోడల్ ఆధారంగా కరోనా థర్డ్ వేవ్ను అంచనా వేస్తున్నట్లు పరిశోధకుల బృందం వెల్లడించింది. ముఖ్యంగా కేరళ,మహారాష్ట్ర వంటి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలు థర్డ్ వేవ్లోనూ ఎక్కువ కేసులు రిపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే గతంలో కరోనా థర్డ్ వేవ్కు సంబంధించి ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ చేసిన ఒక అంచనా తప్పయింది. దీనికి కారణం తప్పుడు పారామీటర్స్ను పరిగణలోకి తీసుకోవడమేనని ఆయన రీసెర్చ్ బృందం వెల్లడించింది.
విజృంభిస్తున్న డెల్టా వేరియంట్...
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. మున్ముందు ఇది చికెన్ పాక్స్ తరహాలో విజృంభించవచ్చునని... వ్యాక్సిన్ వేసుకున్నవారికి కూడా డెల్టా వేరియంట్ సోకే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి భారత్లో సెకండ్ వేవ్ తీవ్రతకు కూడా ఈ వేరియంటే కారణమన్న ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా డెల్టా వేరియంట్ కేసులు అక్కడకక్కడా నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా వేవ్ కేసుల పట్ల వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
Recommended Video
సెప్టెంబర్ నాటికి... ఎయిమ్స్ అంచనా?
దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని గత జూన్లో ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 30వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.