టెక్కీలంతా స్వార్థపరులు: కట్జూ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టెక్కీలు స్వార్థపరులని, వారికి భారత్ పైన నిజమైన ప్రేమ లేదని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ ఆరోపించారు. అతను రెండు రోజుల క్రితం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఐఐటీల్లో చదువుకుని బయటకు వస్తున్న వారు స్వార్థపరులేనని, వారెవరికీ భారత్ పైన నిజమైన ప్రేమ ఉన్నట్టుగా తనకు కనిపించడం లేదన్నారు. ఐఐటీయన్లు తమ ప్రయోజనాలకు పాకులాడుతున్నరే తప్ప, వారిలో దేశభక్తి కొరవడిందన్నారు. దేశ అభివృద్ధి ఆలోచనలు లేవన్నారు.
భారత దేశంలో చదివి, ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం సంపాదించి... ప్రవాస భారతీయులుగా మారిపోతూ దేశానికి అన్యాయం చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోందన్నారు. ఇది దేశానికి, దేశ ప్రజలకు మంచిది కాదన్నారు.
ఐఐటియన్లంతా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బులతో, సబ్సిడీపై విద్యను అభ్యసిస్తున్నారని, ప్రతి భారతీయుడూ విద్యార్థుల ఐఐటీ విద్యకు డబ్బిస్తున్నాడన్న విషయం మరిచిన టెక్కీలు.. తమ విజ్ఞాన ఫలాల్ని అమెరికాకు పంచుతున్నారన్నారు.