ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. చట్ట రూపం దాల్చిన మరుసటి రోజే ఘటన
లక్నో : దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే తలాక్ చెప్పాడో భర్త. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వకపోవడంతో తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. అదీ కూడా రోడ్డు మీద తనకు భార్యతో ఏ సంబంధం లేదని తేల్చిచెప్పి వెళ్లిపోవడం కలకలం సృష్టిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్లోని మధురాలో ఈ ఘటన జరిగింది.
ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లిం భర్తలపై ఉక్కుపాదం మోపే చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజముద్ర కూడా వేశారు. ట్రిపుల్ తలాక్ చట్టరూపం దాల్చిన మరుసటి రోజే యూపీలో ఓ భర్త తలాక్ చెప్పాడు.
మధురాకు చెందిన జమిరాత్ అనే మహిళను మేవాత్కు చెందిన ఇక్రమ్ పెళ్లిచేసుకున్నాడు. అయితే వీరికి పెళ్లి సమయంలో లక్ష రూపాయల కట్నం ఇస్తామని హామీనిచ్చారు. అయితే కట్నం ఇవ్వలేదు. దీంతో ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. కట్నం ఇచ్చేందుకు జమిరాత్ ఫ్యామిలీ నిరాకరించింది. దీంతో ఇక్రమ్ ఆగ్రహానికి గురయ్యాడు. పంచాయతీ పెద్దల ముందే రోడ్డుపైనే జమిరాత్కు తలాక్ చెప్పి వెళ్లిపోయాడు.