జయలలిత మృతి: శశికళ మేనకోడలు విచారణ, వీడియో ఎందుకు తీశారని ప్రశ్నలు !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు మంగళవారం శశికళ మేనకోడలు క్రిష్ణప్రియ హాజరై వివరణ ఇచ్చారు.
వివరాలు రికార్డు !
జయలలిత వదిన ఇళవరసి కుమార్తె, జాజ్ సినిమాస్, జయా టీవీ సీఇవో వివేక్ సోదరి అయిన క్రిష్ణప్రియ నుంచి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ వివరాలు సేకరించారు. దాదాపు మూడు గంటల పాటు శశికళ మేనకోడలు క్రిష్ణప్రియను ప్రశ్నించి వివరాలు సేకరించిన ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఆ వివరాలు రికార్డు చేసుకున్నారు.
ఒక్క రోజు ముందు !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పోలింగ్ కు ఒక్క రోజు ముందు టీటీవీ దినకరన్ అనుచరుడు, అన్నాడీఎంకే పార్టీ అనర్హత ఎమ్మెల్యే వెట్రివేల్ జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
క్రిష్ణప్రియ ఫైర్
జయలలిత వీడియో విడుదలైన రోజు మీడియా ముందుకు వచ్చిన క్రిష్ణప్రియ ఆ వీడియోను జాగ్రత్తగా దాచిపెట్టాలని చెప్పి తామే టీటీవీ దినకరన్ కు ఇచ్చామని, వాటిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. జయలలిత వీడియో తాము ఇచ్చామని చెప్పిన క్రిష్ణప్రియ ఆ వీడియో విడుదల చెయ్యడానికి వెట్రివేల్ ఎవ్వరని ప్రశ్నించారు.
సమన్లు జారీ
జయలలిత వీడియో విడుదలైన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ జనవరి 2వ తేదీన తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని క్రిష్ణప్రియకు సమన్లు జారీ చేశారు. సమన్లు అందుకున్న క్రిష్ణప్రియ మంగళవారం విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.
వీడియో ఎందుకు తీశారు ?
అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో వీడియో ఎవరు, ఎందుకు తీశారు, ఆ వీడియో మీ దగ్గరకు ఎలా వచ్చింది, టీటీవీ దినకరన్ కు వీడియో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది తదితర ప్రశ్నలకు క్రిష్ణప్రియ వివరణ ఇచ్చారని తెలిసింది. క్రిష్ణప్రియతో పాటు శశికళ టీటీవీ దినకరన్, అపోలో ఆసుపత్రి వైద్యులకు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది.