రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భారత్: స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. ట్రూడో వ్యాఖ్యలు అసమగ్రంగా ఉన్నాయని, అనవసరమని తేల్చి చెప్పింది.
ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరమంటూ కెనడా ప్రధానికి స్పష్టం చేసింది. అసలు ట్రూడో ఏమన్నారంటే.. గురునానక్ జయంతి సందర్భంగా ఓ ఆన్లైన్ సమావేశంలో రైతుల ఆందోళనపై ట్రూడో స్పందించారు. భారత్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారనే వార్త తెలిసింది. పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. మా ఆలోచనంతా వారి కుటుంబసభ్యుల గురించేనని ట్రూడో వ్యాఖ్యానించారు.
అంతేగాక, శాంతియుతంగా నిరసన తెలియజేసే వారి హక్కుల పరిరక్షణకు కెనడా మద్దతు ఇస్తుందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాం. మేము చర్చల ప్రాముఖ్యతను విశ్వసిస్తాం. మా ఆందోళన భారత అధికారుల వద్ద వ్యక్తం చేశాం. మనందరినీ ఒక దగ్గర కలిపి ఉంచే సమయం ఇది అని ట్రూడో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ట్రూడోతోపాటు మరికొందరు నేతలు కూడా ఆయనదారిలోని నడిచారు.
ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారతదేశంలోని రైతుల గురించి కొందరు కెనడా నేతలు అసమగ్ర వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. అలాంటి వ్యాఖ్యలు అనవసరం. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఉండకూడదని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తేల్చి చెప్పారు.
ట్రూడో వ్యాఖ్యలను ఇతర పార్టీల నేతలు కూడా ఖండించారు. తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరమని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రూడో నుంచి ఇలాంటి స్పందన ఆహ్వానించలేమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది.
Recommended Video