కరోనా పేషెంట్ల అవయవాలు మాయం చేస్తున్నారు... అందుకే ఆస్పత్రుల్లో చేరం... అక్కడ వింత వదంతులు...
కరోనాతో ఆస్పత్రిలో చేరితే అవయవాలను మాయం చేస్తున్నారట... అసలు కరోనా లేకపోయినా పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారట.... ఇవీ పంజాబ్ పల్లెల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న వదంతులు. ఇవన్నీ నిజమేనని నమ్మి అక్కడి ప్రజలు ఆస్పత్రులకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు.ఎవరైనా హెల్త్ వర్కర్స్ శాంపిల్స్ సేకరించేందుకు వెళ్లినా వారిని తరిమికొడుతున్నారు.
అవయవాలను మాయం చేయడం,కరోనా లేకపోయినా ఉందని చెప్పడం... అవన్నీ వదంతులేనని ప్రభుత్వం చెప్పినా వారు నమ్మట్లేదు. దీంతో వదంతులు వ్యాప్తి చేస్తున్నవారిపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఈ వదంతులపై అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియజేసేలా ప్రముఖ మీడియా సంస్థ 'ది ప్రింట్' ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
పంజాబ్ గ్రామీణ జనం ఏమంటున్నారు...
వదంతులపై ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన పంజాబ్ గ్రామీణ ప్రజలు వాటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. బతాలా పరిధిలో ఉన్న కంగ్రా గ్రామానికి చెందిన మనీందర్ సింగ్ అనే వ్యక్తి దీనిపై మాట్లాడుతూ... అసలు కరోనాకు మందే లేనప్పుడు మేమెందుకు ఆస్పత్రిలో చేరాలి అని ప్రశ్నించారు. అంతేకాదు,ఆస్పత్రిలో చేరితో కరోనా చికిత్స పేరుతో చంపేస్తున్నారని అక్కడి ప్రజలు అంటున్నారు. దోలెవాల్కి చెందిన సుఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ... 'నా మేనల్లుడు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్నప్పుడు.. నాతో ఫోన్లో మాట్లాడుతూ అరిచిన అరుపులు నేనెప్పటికీ మరిచిపోలేను.అతను కరోనాతో చనిపోలేదు. వాళ్లే చంపేశారు...' అని ఆరోపించాడు.
అందుకే ఆస్పత్రిలో చేరమంటున్నారని...
'నిజానికి నా మేనల్లుడికి టైఫాయిడ్ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. కానీ ఆ తర్వాత కరోనా సోకిందని పటియాలా రజీంద్ర ఆస్పత్రిలోని కోవిడ్ 19 వార్డులో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చికిత్స జరుగుతున్నన్ని రోజులు ఎప్పుడు ఫోన్ చేసినా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లండని ఏడ్చేవాడు.' సుఖ్వీందర్ సింగ్ పేర్కొన్నారు. పటియాలాకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ... వాళ్లు తమను ఆస్పత్రిలో చేరాలని చెప్పేది అవయవాలను మాయం చేసేందుకేనని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు, అవయవాలు తీసుకునేందుకు ఆస్పత్రి నుంచి రహస్యంగా మార్చురీకి మృతదేహాలను ఎలా తరలిస్తారో తాను చూశానన్నారు.
హెల్త్ టీమ్స్పై దాడులు
అక్కడి వ్యక్తులు చెబుతున్న మాటలను బట్టి వాళ్లలో వదంతులు ఎంత బలంగా నాటుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి గ్రామాల్లోకి హెల్త్ టీమ్స్ను అనుమతించకుండా చాలా గ్రామాలు తీర్మానాలు కూడా చేశాయి. ఎవరైనా శాంపిల్స్ కోసం తమ గ్రామాల్లోకి వస్తే తరిమి కొడుతున్నారు. దీంతో గ్రామాల్లోకి వెళ్లేందుకు హెల్త్ వర్కర్స్ భయపడుతున్నారు. కొన్నిచోట్ల గో బ్యాక్ నినాదాలతో హెల్త్ వర్కర్స్పై రాళ్ల దాడి చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో హెల్త్ వర్కర్స్కు రక్షణ కల్పించి మరీ గ్రామాల్లోకి పంపించాల్సిన పరిస్థితి నెలకొంది.
కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం...
పంజాబ్లో కోవిడ్ 19 మరణాల సంఖ్యను పరిశీలిస్తే జాతీయ సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం జాతీయ సగటు 1.59 ఉండగా పంజాబ్లో 2.98శాతం ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లేనిపోని వదంతులను నమ్మి హెల్త్ వర్కర్స్కి ప్రజలు సహకరించకపోవడం సమస్యను మరింత జటిలం చేసేదిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వదంతులను వ్యాప్తి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఓ వీడియో షేర్ చేసినందుకు ఓ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటివరకూ మొత్తం 120 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది.
అలాగే ప్రజలకు అవగాహన కల్పించేందుకు అటు సోషల్ మీడియా ద్వారా ఇటు హెల్త్ టీమ్స్ ద్వారా విస్తృత క్యాంపెయిన్స్ నిర్వహిస్తోంది.